
తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేషీలో పనిచేసే ఉద్యోగి ఓ క్రీడాకారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా వస్తున్న కథనాలు సంచలనం సృష్టించాయి. దీనిపై బాధితురాలు ప్రతిభ స్పందించారు. అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన సమయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ను కలిసేందుకు ప్రయత్నించినట్లు ఆమె చెప్పారు. అప్పటి నుంచి మంత్రి పేషీలో పనిచేసే ఉద్యోగి సురేంద్ర తనకు అసభ్యంగా మెసేజ్లు పెడుతున్నాడని ప్రతిభ ఆరోపించారు.
తాను హెచ్చరించినా అతను తీరు మార్చుకోలేదని..దీనిపై తన బాబాయ్కి చెబితే కాల్ చేసి హెచ్చరించారని ప్రతిభ వెల్లడించింది. మంత్రికి తెలిస్తే తన ఉద్యోగం పోతుందని, ఆత్మహత్య చేసుకుంటానని అన్నాడని ఆమె పేర్కొంది. ఏకంగా స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ సిబ్బంది నుంచి వేధింపులు ఎదుర్కొంటానని ఊహించలేదన్నారు. మహిళా క్రీడాకారులకు భద్రత లేకుండా పోయిందన్నారు. చాలామంది చాలా రకాలుగా వేధిస్తున్నారని.. కొందరు బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నారని ప్రతిభ వాపోయారు.
తాను ధైర్యంగా ఫైట్ చేశానని.. వాళ్లకు లొంగలేదని కొన్నిసార్లు సెలక్షన్ లిస్టులో తన పేరును తొలగించారని ఆమె ఆరోపించారు. కొంతమంది కోచ్లు కామాంధులుగా మారారని ప్రతిభ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళా క్రీడాకారులకు జరుగుతున్న వేధింపులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి గుర్తింపు లభించలేదని ప్రతిభ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది.