పేపర్ లీక్ కేసు.. రాజశేఖరే ప్రధాన సూత్రధారి, ఉద్దేశ్యపూర్వకంగానే టీఎస్‌పీఎస్సీకి : సిట్ నివేదికలో కీలకాంశాలు

By Siva KodatiFirst Published Mar 17, 2023, 5:27 PM IST
Highlights

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ ఘటనకు సంబంధించి  కీలక సూత్రధారి రాజశేఖరేనని తేల్చింది సిట్. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా వున్న రాజశేఖర్ కంప్యూటర్ హ్యాక్ చేసి పాస్‌వర్డ్‌ను దొంగతనం చేసి దానిని ప్రవీణ్‌కు ఇచ్చినట్లు నిర్ధారించింది. 

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ ఘటనకు సంబంధించి కమీషన్‌కు సిట్ నివేదిక అందజేసింది. ఈ కేసులో కీలక సూత్రధారి రాజశేఖరేనని.. అతను ఉద్దేశపూర్వకంగానే డిప్యూటేషన్‌పై టీఎస్‌పీఎస్సీకి వచ్చినట్లు సిట్ నిర్ధారించింది. ఇతను టెక్నికల్ సర్వీస్ నంచి డిప్యూటేషన్‌పై వచ్చాడు. అనంతరం ఇక్కడ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా వున్న ప్రవీణ్‌తో సంబంధాలు కొనసాగించాడు రాజశేఖర్. ఇక్కడ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా వున్న రాజశేఖర్ కంప్యూటర్ హ్యాక్ చేసి పాస్‌వర్డ్‌ను దొంగతనం చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. అయితే పాస్‌వర్డ్‌ను తాను ఎక్కడా రాయలేదని శంకర్ లక్ష్మీ చెబుతోంది. కానీ శంకర్ లక్ష్మీ చెప్పిన దానితోనే అతను కంప్యూటర్ హ్యాక్ చేసినట్లు నిర్ధారించారు. 

అనంతరం పెన్‌డ్రైవ్ ద్వారా 5 ప్రశ్నాపత్రాలను కాపీ చేసి దానిని ప్రవీణ్‌కు ఇచ్చాడు. అనంతరం ఏఈ పరీక్షా పత్రాన్ని రేణుకకు అమ్మాడు ప్రవీణ్. ఈ క్రమంలో ఫిబ్రవరి 27నే పేపర్ లీకైనట్లు సిట్ గుర్తించింది. తొలుత గ్రూప్ 1 పరీక్షా పత్రం లీకైనట్లు తేల్చింది. ప్రవీణ్‌కు 103 మార్కులు రావడంతో సిట్ విచారణ జరిపింది. కమీషన్ సెక్రటరీ దగ్గర పీఏగా పనిచేస్తూ ప్రశ్నాపత్రాన్ని కొట్టేసినట్లుగా సిట్ నిర్ధారించింది. మరోవైపు పేపర్ లీక్ కేసులో నిందితులకు న్యాయస్థానం ఆరు రోజుల కస్టడీ విధించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 9 మందిని సిట్ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో రేపటి నుంచి ఈ నెల 23 వరకు నిందితులను సిట్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్ధానం ఆదేశాలు జారీ చేసింది. 

Also REad: పేపర్ లీక్ .. గ్రూప్ 1 పరీక్ష రద్దు చేస్తూ టీఎస్‌పీఎస్సీ సంచలన నిర్ణయం

ఇకపోతే.. పేపర్ లీక్ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జరిగిన పరీక్షలు సహా మొత్తం గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 11న మళ్లీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్, ఏఈఈ, డీఏవో పరీక్షలు రద్దు చేస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఏఈఈ, డీఏవో పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. గతేడాది అక్టోబర్ 16న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 

click me!