ఆ చట్టం ఏమిటో తెలుసుకో: కేసీఆర్ వ్యాఖ్యలపై ఆశ్వత్థామరెడ్డి

By narsimha lodeFirst Published Oct 25, 2019, 12:59 PM IST
Highlights

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి శుక్రవారం నాడు స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీపై తీసుకొచ్చిన చట్టంపై అవగాహన పెంచుకోవాలని కేసీఆర్ కు ఆశ్వత్తామరెడ్డి సూచించారు. 

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని కరీంనగర్‌ ఎన్నికల సభలో కేసీఆర్  ఇచ్చిన హామీని అమలు చేయాలని ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామ రెడ్డి డిమాండ్ చేశారు.ఆర్టీసీ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సీఎం కేసీఆర్  అవగాహన చేసుకోవాలని  ఆశ్వత్థామరెడ్డి కోరారు. 

ఆర్టీసీ జేఎసీ నేతలు శుక్రవారం నాడు హైద్రాబాద్‌లో సమావేశమయ్యారు. గురువారం నాడు సాయంత్రం  సీఎం కేసీఆర్  ఆర్టీసీ సమ్మెపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆర్టీసీ జేఎసీ నేతలు చర్చించారు. భవిష్యత్తులో  తీసుకోవాల్సిన కార్యాచరణపై చర్చించారు.

Also Read:ఆర్టీసీ నీ జాగీరు కాదు, ఎవరికి ముగింపో ప్రజలే నిర్ణయిస్తారు: కేసీఆర్ కు అశ్వత్థామరెడ్డి వార్నింగ్

ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ యాజమాన్యం, అధికారులు మంచివాళ్లేనని సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఆశ్వత్థామ రెడ్డి స్వాగతించారు. రాజకీయ పార్టీలు ప్రజల కోసం పనిచేయాలి, ట్రేడ్ యూనియన్లు కార్మికుల పక్షంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. 

ఐదేళ్లకు ఓసారి ఎన్నికలు ఎలా జరుగుతాయో కార్మికుల హక్కుల కోసం పోరాటం చే్స్తున్న ట్రేడ్‌యూనియన్ల కోసం కూడ  రెండేళ్లు లేదా మూడేళ్ల కోసం ఎన్నికలు జరుగుతాయని ఆయన గుర్తు చేశారు.

కరీంనగర్ ఎన్నికల సభలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ ఇచ్చిన హామీనే అమలు చేయాలని తాము కోరుతున్నామని ఆశ్వత్థామ రెడ్డి చెప్పారు.

ఏపీ రాష్ట్రంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఏపీ  సీఎం జగన్ తీసుకొన్న నిర్ణయాన్ని కూడ తెలంగాణ సీఎం కేసీఆర్ అపహాస్యం చేసేలా మాట్లాడడంపై ఆశ్వత్థామరెడ్డి తప్పుబట్టారు. నవంబర్ 15వ తేదీలోపుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే విషయమై నిర్ణయానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని తాజగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ఆశ్వత్థామరెడ్డి గుర్తు చేశారు.

కేసీఆర్ ఎజెండాతో ఏపీ సీఎం జగన్‌ మనసు కూడ మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆశ్వత్థామరెడ్డి  ఆరోపించారు.760 అద్దె బస్సుల కోసం టెండర్లు పిలిస్తే 18 బస్సులు మాత్రమే వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

దూరప్రాంతాలకు నడిచే బస్సు సర్వీసులు ఆర్టీసీలో లాభాలు ఉన్నట్టుగా ఆశ్వత్థామరెడ్డి చెప్పారు. సిటీ, గ్రామీణ ప్రాంతాల్లో నడిచే రూట్లలో తిరిగే బస్సులు మాాత్రమే నష్టాల్లో ఉన్నాయన్నారు.

 ఈ నెల 5వ తేదీ నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు.ఆర్టీసీ సమ్మె విషయంలో గురువారం నాడు సీఎం కేసీఆర్ సీరియస్ కామెంట్స్ చేశారు.ఆర్టీసీ ఇక ఉండనే ఉండదని స్పష్టం చేశారు.ఆర్టీసీ యూనియన్లు సమ్మె చేస్తూ కార్మికులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టారని కేసీఆర్ విమర్శలు చేశారు.ఈ నెల 30వ తేదీ వరకు ఆర్టీసీ జేఎసీ ఇంతకు ముందే కార్యక్రమాలను ప్రకటించింది. 


 

click me!