ఆర్టీసీని కేసీఆర్ ఏం చేయలేరు, కారణమిదే: ఆశ్వత్థామరెడ్డి

By narsimha lodeFirst Published Nov 5, 2019, 3:31 PM IST
Highlights

సమ్మె విషయంలో తాము వెనక్కు తగ్గేది లేదని ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం నాడు ఆర్టీసీ జేఎసీ నేతలు, అఖిలపక్ష పార్టీలతో సమావేశమయ్యారు. 


హైదరాబాద్: ఆర్టీసీలో కేంద్రానికి 30 శాతం వాటా ఉంది, ఆర్టీసీలో ఎలాంటి  మార్పులు చేర్పులు చేయాలన్నా కూడ కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆర్టీసీ జేఎసీ కన్వీనర్  ఆశ్వత్థామరెడ్డి చెప్పారు.ఆర్టీసీపై కేసీఆర్ తీసుకొనే ఏ నిర్ణయం కూడ చెల్లుబాటు కాదని ఆశ్వత్థామరెడ్డి చెప్పకనే చెప్పారు.

ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5వ తేదీ రాత్రి వరకు విధుల్లో చేరాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఈనెల 2వ తేదీన డెడ్‌లైన్ విధించారు. ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరకపోతే ఇక వారిని విధుల్లోకి తీసుకోబోమని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

ఈ డెడ్‌లైన్‌కు సంబంధించి ఆర్టీసీ జేఎసీ నేతలు, అఖిలపక్ష పార్టీలతో మంగళవారం నాడు జేఎసీ నేతలు సమావేశమయ్యారు. కార్మికులు ఎక్కడా కూడ విధుల్లో చేరలేదని ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి చెప్పారు. విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మికులు కూడ వెనక్కి వచ్చినట్టుగా  ఆయన తెలిపారు.

Also read:ఆర్టీసీ కోలుకునే ఛాన్స్ లేదు.. మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్‌సైడే: ఎర్రబెల్లి

తాము సమ్మెను విరమించే ప్రసక్తే లేదని  ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి చెప్పారు. సమ్మె చేస్తున్న తమతో  ప్రభుత్వం చర్చించాలని  ఆశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు.

ప్రభుత్వంతో పాటు  కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యల వల్ల ఆర్టీసీ కార్మికులు  చనిపోతున్నారని ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 మంది ఆర్టీసీ కార్మికులు మృతి చెందితే కనీసం ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు.

ఎన్ని డెడ్‌లైన్‌లు పెట్టినా కూడ సమ్మె యధావిధిగా కొనసాగిస్తామని ఆయన చెప్పారు. చర్చల ప్రక్రియ ప్రారంభించకుండానే  బెదిరింపులకు పాల్పడితే ఎలా అని ఆశ్వత్థామరెడ్డి ప్రశ్నించారు. 

Also Read:5వ తేదీ అర్ధరాత్రి వరకే డెడ్‌లైన్: ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ ఫైనల్ ఛాన్స్

ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరిస్తాం, ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం సరైంది కాదని  ఆశ్వత్థామరెడ్డి తెలిపారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం చర్చించాలని  ఆయన డిమాండ్ చేశారు.
Also Read:వాళ్లేం చేసుకుంటే మాకేం: జగన్ ఆర్టీసీ విలీనం నిర్ణయంపై కేసీఆర్

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం ఇప్పటికైనా చర్చించేందుకు ముందుకు రావాలని  ఆయన సూచించారు. కార్మికులు ఎవరూ కూడ భయపడకూడదని  ఆశ్వత్థామరెడ్డి కోరారు.

click me!