
హైదరాబాద్ : హైదరాబాద్లో మంగళవారం గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ను దాటగా, ఇతర జిల్లాల్లో 44 డిగ్రీల సెల్సియస్ను దాటింది. మంగళవారం, భారత వాతావరణ విభాగం (IMD) సర్వే ప్రకారం, హైదరాబాద్లో గరిష్టంగా 40.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది, ఇది మునుపటి రోజు గరిష్టం కంటే 1 డిగ్రీ ఎక్కువ. మార్చిలో వడగాలుల సమయంలో ఉష్ణోగ్రత 40-డిగ్రీల మార్కును దాటింది, అయితే వేడిగాలులు తగ్గిన తర్వాత ఉష్ణోగ్రత కూడా తగ్గింది.
తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్డిపిఎస్) ప్రకారం, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల్లోని పలు చోట్ల గరిష్టంగా 44 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదయ్యింది. నిజామాబాద్లోని లక్మాపూర్లో గరిష్టంగా 44.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
IMD సూచనల ప్రకారం, హైదరాబాద్లో రాబోయే రెండు రోజులు కూడా ఉష్ణోగ్రత 40కి చేరుకునే అవకాశం ఉందని, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా ఉంటుందని అంచనా.
ఇదిలా ఉండగా, ఏప్రిల్ 10న దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయంటూ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో ప్రభుత్వాలు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి. ఎండల తీవ్రత అధికంగా ఉండే మధ్యాహ్నం వేళల్లో బయటకు రాకుండా ఉండటం మంచిదని సూచిస్తున్నాయి. ఎండల తీవ్రత నేపథ్యంలో భారత వాతావరణ విభాగం ప్రజలను హెచ్చిరించింది. మరీ ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఎండల తీవ్రత పెరుగుతోంది. వేడిగాలులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.
తీవ్రమైన వేడిగాలులను అంచనా వేసిన ఐఎండీ.. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆదివారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 23.5 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరపడింది. ఇది సాధారణం కంటే నాలుగు డిగ్రీలు ఎక్కువగా ఉంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వేడి వాతావరణం గురించి భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. దేశరాజధానిలో సాపేక్ష ఆర్ద్రత ఉదయం 8.30 గంటలకు 32 శాతంగా నమోదైంది. గరిష్ట ఉష్ణోగ్రత ఆదివారం 42 డిగ్రీల సెల్సియస్ను దాటే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. పగటిపూట స్పష్టమైన ఆకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.
అయితే నగరం అంతటా కొన్ని ప్రదేశాలలో తీవ్రమైన హీట్వేవ్ పరిస్థితులతో చాలా చోట్ల అధికా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రకటించింది. ఇక శనివారం నాడు గరిష్ట ఉష్ణోగ్రత 42.4 డిగ్రీల సెల్సియస్ను తాకడంతో ఐదేళ్లలో ఢిల్లీలో అత్యంత వేడిగా ఉన్న రోజుగా నిలిచింది. పొరుగున ఉన్న గురుగ్రామ్లో గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ మార్కుకు దగ్గరకు చేరడం ప్రస్తుతం ఎండల తీవ్రతకు అద్దం పడుతోంది. ఏప్రిల్ 21, 2017న ఢిల్లీలో గరిష్టంగా 43.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెలలో అత్యధికంగా 45.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఏప్రిల్ 29, 1941న నమోదైంది. ఏప్రిల్ ప్రథమార్థంలో ఢిల్లీలో ఇంత అధిక ఉష్ణోగ్రత నమోదు కావడం గత 72 సంత్సరాలలో ఇదే తొలిసారి అని IMD వెల్లడించింది.