గోడలకు పెయింట్ వేసే స్థాయి నుంచి.. తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జీవితంలో మలుపులు

By Rajesh KarampooriFirst Published Nov 11, 2023, 8:24 PM IST
Highlights

Telangana CM Anumula Revanth Reddy: ఆయన ఏం చేసినా సంచలనమే. ఆయన రంగంలో దిగితే ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపిస్తుంటారు. పదునైన మాటలతో ప్రత్యర్థులను ఇరకాటంలో పడేస్తారు. ఆయనే అనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy) . తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు ఆయన తన సర్వశక్తులను ఒడ్డిస్తున్నారు.  ఆయన పొలిటికల్ జర్నీపై ASIANET NEWS TELUGU ప్రత్యేక కథనం.

Telangana CM Anumula Revanth Reddy తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు. తనదైన దూకుడుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఈ మాస్ అండ్ ఫైర్ బ్రాండ్ లీడర్. టీఆర్ఎస్ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన అనతికాలంలోనే ఎన్నో కీలక పదవులు దక్కించుకున్నారు.  తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించారు. అలాగే తన రాజకీయ జీవితం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. పలు వివాదాలకు కేరాఫ్ నిలిచారు. కొత్త కాలం జైలుపాలు కూడా కావాల్సి వచ్చింది.  అనుకొని పరిమాణాలతో టీపీపీసీ అధ్యక్ష పగ్గాలను చేపట్టారు. ఒకవైపు రాజకీయాల్లో తలపండిన నేతలను బుజ్జగిస్తూ..  తెలంగాణకు రెండో ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి పొలిటికల్ జర్నీపై ASIANET NEWS TELUGU ప్రత్యేక కథనం.

వ్యక్తిగత జీవితం.. 

అనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy) 1969 నవంబర్ 8న మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లి దగ్గర ఉన్న గంగూర్ అనే గ్రామంలో ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. రేవంత్ రెడ్డి తండ్రి నరసింహారెడ్డి, తల్లి రామచంద్రమ్మ. ఈ దంపతులకు మొత్తం ఎనిమిది మంది సంతానం. చిన్నప్పటి నుంచే రేవంత్ రెడ్డి అనేక అంశాల్లో దూకుడుగా వ్యవహరించారు.  పాఠశాలలో కూడా చాలా చురుగ్గా ఉంటూ నాయకత్వ లక్షణాలను ప్రదర్శించేవారు. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్న రేవంత్ రెడ్డి ఆ తరువాత ఒక ప్రైవేట్ కాలేజీలో చేరి ఇంటర్ పూర్తి చేశారు. డిగ్రీ కోసం హైదరాబాద్ కెళ్లి.. ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధ కళాశాల అయిన ఏవీ కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.ఈ తరుణంలో విద్యార్ధి లీడర్ గా వ్యవహరిస్తూ..  
వాళ్ల సమస్యలపై పోరాటాలు కూడా చేశారు.


 
1990లో కాలేజ్ చదువు పూర్తయిన తర్వాత పెయింటర్ గా తన కెరీర్ స్టార్ట్ చేశారు రేవంత్ రెడ్డి. ఆ తరువాత తన అన్న సహాకారంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగారు. పట్టిందల్లా బంగారం అన్నట్టు ఆయన ఏ రంగంలో అడుగుపెట్టిన సక్సెస్ అయ్యే వారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా అంచలెంచలుగా ఎదిగారు. రేవంత్ రెడ్డి ఇక జైపాల్ రెడ్డి తమ్ముడు కూతురు అయినటువంటి గీతారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో ఆయన కలలను సాకారం చేసుకునే దిశగా అడుగులేశారు. 2001 వరకు వ్యాపారం పై మాత్రమే దృష్టి పెట్టినా ఆయన పేదవారిని ఆదుకోవడం. అనాధలకు పెళ్లిళ్లు చేయించడం వంటి అనేక సేవా కార్యక్రమాలను చేశారు. తనకంటూ ప్రత్యేక బలగాన్ని ఏర్పర్చుకున్నారు. రేవంత్ రెడ్డి ఆ తర్వాత రాజకీయాల మీద మనసు పడటంతో రాజకీయ రంగంలోకి అడుగు పెట్టాలనుకున్నారు. 


 
ఈ క్రమంలో 2006లో టిఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్న ఆయన పార్టీ అనేక కార్యక్రమాల్లో కీలక భాగస్వామి అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించారు. కేసీఆర్ మీద నమ్మకం పెట్టుకున్న రేవంత్ కల్వకుర్తి టికెట్ కూడా ఆశించారు. కానీ పొత్తులో భాగంగా ఆ స్థానం కాంగ్రెస్ పార్టీకి వెళ్లిపోవడంతో చేసేంది ఏం లేక మౌనం దాల్చారు. రాజకీయాలు ఇలాంటివన్నీ సహజం.. ఈసారి కాకపోతే.. మరోసారి అవకాశం కచ్చితంగా దక్కుతుందని టిఆర్ఎస్ లోనే కొనసాగారు. గులాబీ బాస్ కేసీఆర్ తో కలిసి అడుగులు వేస్తారు. ఈ సారి జడ్పిటిసి ఎన్నికల్లో టికెట్ ఆశించారు. కానీ, ఆ టికెట్ దక్కకపోవడంతో మనస్థాపం చెందిన రేవంత్ రెడ్డి వెంటనే టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చారు. జీవితంలో మరోసారి టిఆర్ఎస్ ముఖం చూడకూడదని గట్టి నిర్ణయానికి వచ్చారు.

ఈ తరుణంలో ఏ పార్టీలో చేరకుండా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి జడ్పిటిసిగా మొట్టమొదటిసారిగా గెలుపొందారు. ఇక 2007లో మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తన సత్తా ఏంటో అందరికి చూపించారు. రేవంత్ రెడ్డి విజయం ఆనాడు తెలంగాణ వ్యాప్తంగా సంచలనగా మారింది. మొట్టమొదటిసారిగా రేవంత్ పేరు తెలంగాణ వ్యాప్తంగా మారుమోగింది. ఈ తరుణంలో తన అభిమాన పార్టీ టీడీపీ మొగ్గు చూపారు రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాను గెలుపొందినటువంటి సర్టిఫికెట్ తీసుకుని వెళ్లి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

రేవంత్ రెడ్డి అలా ఆ క్షణం నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యునిగా ప్రతి కార్యక్రమంలో చాలా చురుకుగా పాల్గొనేవారు. ఇక 2009లో జరిగిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డిపై నమ్మకం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ  కొడంగల్ టికెట్ ను రేవంత్ రెడ్డికి కేటాయించింది. పార్టీ అధినేత పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో ఏడు వేల ఓట్ల మెజారిటీతో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలు కావడంతో  ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వచ్చింది. అయినా..రేవంత్ రెడ్డి  ఆ విషయాన్ని పట్టించుకోకుండా.. అసెంబ్లీలో వైఎస్ఆర్ కి ధీటుగా తెలుగుదేశం పార్టీ తరపున తన వాణి వినిపించారు. అధికార పార్టీకి చుక్కలు చూపించారు రేవంత్ రెడ్డి.

2009లో వైయస్సార్ మరణం తర్వాత రాష్ర్ట రాజకీయాల్లో అనుహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ తరుణంలో తెలంగాణ ఉద్యమం మరింత ఊపందుకోవడం. తెలుగుదేశం పార్టీ రెండు కళ్ల సిద్దాంతాన్ని అవలంభించడంతో ఆయన కాస్త కొంత చిక్కులో పడాల్సివచ్చింది. అయినా ఆయన పార్టీని వీడలేదు. తనదైన శైలిలో తెలంగాణ వాణి గట్టిగా వినిపించారు. రాష్ట్ర విభజన అనంతరం .. 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా కోడంగల్ స్థానం నుంచి రేవంత్ రెడ్డి గెలుపొంది తన సత్తా ఏంటో తెలంగాణ ప్రజానీకానికి చూపించారు. కానీ, గులాబీ బాస్ కేసీఆర్.. తెలుగుదేశం నేతలందరినీ "ఆపరేషన్ ఆకర్ష్" పేరుతో తన పార్టీలోకి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా రేవంత్ రెడ్డి తలొగ్గకుండా.. గట్టిగా నిలబడ్డారు. ఆ పోరాట ఫలితంగానే ఆయన తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా అయ్యారు. 

కానీ, కేసీఆర్ కపట నీతి ముందు నిలవలేకపోయారు రేవంత్ రెడ్డి. 2015లో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్ కావటం తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అదే సమయంలో తన కూతురి పెళ్లి ఉన్న సందర్భంలో కూడా ఆయన జైల్లో గడపాల్సి వచ్చింది. ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వరి ప్రోత్సాహంతో, ప్రోత్బలంతో వాళ్ళ అండదండలతో జైలు నుంచి స్పెషల్ పర్మిషన్ మీద వచ్చి తన పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించారు. 

ఆ తరువాత జరిగిన రాజకీయ పరిమాణాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.  అధికార గులాబీ పార్టీని టార్గెట్ చేస్తూ.. కేసీఆర్ కు కొరకరాని కొయ్యగా మారారు. అతి కొద్ది కాలంలోనే కాంగ్రెస్ అధిష్టానం దృష్టిని ఆకర్షించారు. ఈ తరుణంలో జరిగిన 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కొడంగల్ నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డిపై గులాబీ సేన ప్రత్యేక దృష్టి పెట్టింది. కేసీఆర్ సర్వశక్తులను ఒడ్డించి రేవంత్ రెడ్డి ఓడించారు. 

ఆ తరువాత జరిగిన 2019 పార్లమెంటు ఎన్నికల్లో  రేవంత్ రెడ్డి  మల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. మొదటిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఇదే ఆయన రాజకీయ జీవితంలో టార్నింగ్ పాయింగ్ గా మారింది. ఆ గెలుపుతో రేవంత్ రెడ్డి సత్తా ఏంటో.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, తెలంగాణ ప్రజలకు తెలిసి వచ్చింది. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవీ కూడా రేవంత్ రెడ్డిని వరించింది. రేవంత్ రెడ్డి తన పాదయాత్రలు, పదునైన మాటలు, ప్రత్యర్థి వ్యూహాలను ఛేదిస్తూ.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు తన సర్వ శక్తులను ఒడ్డించారు. చివరకు తెలంగాణకు రెండో ముఖ్యమంత్రి అయ్యారు. తాను అనుకున్న లక్ష్యాన్ని అనతికాలంలోనే చేధించారు.

click me!