
కుంభమేళా తరహాలో మేడారం జాతరను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగగా ప్రకటించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) డిమాండ్ చేశారు. సమ్మక్క- సారలమ్మ జాతర వైపు సీఎం కేసీఆర్ కన్నెత్తి చూడలేదని విమర్శించారు. మేడారం జాతరను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబందించి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసి.. కేంద్రానికి పంపాలన్నారు. శనివారం రేవంత్ రెడ్డి మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ములుగు జిల్లాకు సమ్మక్క- సారలమ్మ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. రూ.200కోట్లతో శాశ్వత పర్యాటక కేంద్రంగా మేడారాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. మేడారం జాతరకు కేంద్రం కేటాయించిన రూ. 2.5 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీజేపీలో గతంలో భిన్నాభిప్రాయాలకు చోటు ఉండేందని.. నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఏక వ్యక్తి పార్టీగా మారిందని ఆరోపించారు. టీఆర్ఎస్ కూడా అలాగే ఉందని విమర్శించారు.
ఏక వ్యక్తి ఆలోచన ఎప్పటికైనా ప్రమాదమేనని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ది భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందని.. వాళ్లది ఏకత్వంలో మూర్ఖత్వం అని ఎద్దేవా చేశారు. తమ పార్టీలో భిన్న అభిప్రాయాలను చర్చించుకుని.. ఏక నాయకత్వంలో పనిచేస్తామని చెప్పారు. తమ అందరి నాయకురాలు సోనియా గాంధీ అని.. ఆమె మార్గదర్శకత్వంలో పనిచేస్తామని చెప్పారు. జగ్గారెడ్డి, రాఘవరెడ్డి, రాజేందర్.. ఇలా ప్రతి ఒక్కరి పార్టీ కోసం కష్టపడతరని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందన్నారు.
‘16,17 తేదీల్లో జరిగిన నిరసన కార్యక్రమాలల్లో అధికార పార్టీ ఎంత దారునంగా ప్రవర్తించిందో అంతా చూశారు. నన్ను అరెస్ట్ చేయడం, కార్యకర్తలపై కొట్టడంతో.. కోపం, ఆవేశంతో కొంత పరుషమైన పదజాలం వాడాను. అయితే పరుషమైన పదజాలం పోలీసు అధికారులపై వాడకుండా ఉండిఉట్టే బాగుండేదేమోనని అనిపించింది. భవిష్యత్తులో అలాంటి పరుష పదజాలం వాడటం వీలైనంతా మేర తగ్గిస్తాం’ అని చెప్పారు.