హైద్రాబాద్‌లో ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం: కరోనా ఉన్నా డ్యూటీ చేయాలని నర్సుల నిర్భంధం

By narsimha lodeFirst Published Jul 19, 2020, 12:48 PM IST
Highlights

కరోనా లక్షణాలు ఉన్న నర్సులను డ్యూటీలకు రావాలని హైద్రాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం వేధిస్తోంది. ఈ మేరకు నర్సులు తెలంగాణ నర్సింగ్ సమితికి లేఖ రాసింది.
 

హైదరాబాద్: కరోనా లక్షణాలు ఉన్న నర్సులను డ్యూటీలకు రావాలని హైద్రాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం వేధిస్తోంది. ఈ మేరకు నర్సులు తెలంగాణ నర్సింగ్ సమితికి లేఖ రాసింది.

హైద్రాబాద్ మెహిదీపట్నం నానాల్‌నగర్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన నర్సులు విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవలనే ఈ ఆసుపత్రిలో కరోనా వార్డును కూడ ఏర్పాటు చేశారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన నర్సులకు డ్యూటీ వేశారు.

కొంతకాలంగా నర్సులకు ఆసుపత్రి యాజమాన్యం వేతనాలు కూడ ఇవ్వడం లేదు. నర్సులు తమ రాష్ట్రానికి వెళ్లిపోయే అవకాశం ఉందనే నెపంతో ఆసుపత్రి యాజమాన్యం నర్సులకు వేతనాలు చెల్లించడం లేదనే విమర్శలు కూడ లేకపోలేదు.

ఈ నర్సులకు కరోనా లక్షణాలు కన్పిస్తున్నాయి. జలుబు,దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో తమకు పరీక్షలు నిర్వహించాలని ఆసుపత్రి సూపరింటెండ్ ను నర్సులు కోరారు. పారాసిటామాల్ టాబ్లెట్ వేసుకొని విధులు నిర్వహించాలని నర్సులకు ఆసుపత్రి యాజమాన్యం ఆదేశించింది.

కరోనా సోకిన వారిని ఇతరులతో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు. కానీ ఈ ఆసుపత్రి యాజమాన్యం ఏకంగా విధులు నిర్వహించాలని నర్సులను ఆదేశించడంతో వారు ఆందోళనకు గురయ్యారు.

also read:తెనాలి ఎమ్మెల్యే శివకుమార్‌కి కరోనా: మూడో సారి పరీక్షలో తేలిన కోవిడ్

తమను ఆదుకోవాలని కోరుతూ తమిళనాడు రాష్ట్రానికి చెందిన  నర్సులు తెలంగాణ నర్సింగ్ సమితికి లేఖ రాశారు. ప్రభుత్వం తమను ఇక్కడి నుండి పంపాలని కూడ వారు కోరారు.  తమిళనాడు రాష్ట్రానికి చెందిన నర్సులను ఆసుపత్రి యాజమాన్యం ఓ రూమ్ లో నిర్భంధించింది. 

నర్సులు తెలంగాణ నర్సింగ్ సమితికి లేఖ రాయడంతో పాటు తమ ఆవేదనను  వారు ఓ వీడియో రూపంలో మీడియాకు విడుదల చేశారు. ఈ వీడియోను ఓ తెలుగు న్యూస్ ఛానెల్ ఆదివారం నాడు ప్రసారం చేసింది. 
 

click me!