
సోనియా గాంధీ ఎంతో సాహసం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని అన్నారు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆదివారం ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ జనగర్జన సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ చచ్చిపోతుందని సోనియాకు కూడా తెలుసున్నారు. యువకుల బలిదానాలు మరిన్ని జరగకూడదని సోనియా ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు పొంగులేటి. మాయమాటలు చెప్పి కేసీఆర్ రెండు సార్లు అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు. ఇచ్చిన వాగ్థానాల్లో ఏ ఒక్కటి ఆయన అమలు చేయలేదని.. తెలంగాణ వచ్చాక 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
2014 ఎన్నికల సమయంలో, 2018లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి గాలికొదిలేశారని పొంగులేటి దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వరంగల్ డిక్లరేషన్లో ప్రకటించిన అన్ని కార్యక్రమాలు చేస్తామన్నారు. ఉద్యోగాలు ఇవ్వలేదు.. నిరుద్యోగ భృతి లేదని, వచ్చేది తెలంగాణ ప్రభుత్వమేనని శ్రీనివాస్ రెడ్డి జోస్యం చెప్పారు. భారత్ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని ఆయన పేర్కొన్నారు.
Also Read: ఖమ్మం : జనగర్జన సభ.. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
రాహుల్ను ప్రధానిని చేసేలా కృషి చేద్దామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. భట్టి విక్రమార్క మండుటెండల్ని సైతం లెక్క చేయకుండా 1300 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేశారని ప్రశంసించారు. మనందరం కష్టపడి కేసీఆర్ను ఇంటికి పంపుదామన్నారు. ఆరు నెలల పాటు అన్ని వర్గాల వారిని కలిశామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ను బంగాళాఖాతంలో వేయడం కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. కేసీఆర్ తెలంగాణకు చేసేందేమీ లేదన్నారు.