విషాదాంతమైన ఎన్ఆర్ఐ డాక్టర్ జయశీలరెడ్డి మిస్సింగ్: ఫామ్‌హౌస్ కుంటలో డెడ్‌బాడీ లభ్యం

By narsimha lodeFirst Published Sep 7, 2021, 3:48 PM IST
Highlights

నల్గొండకు సమీపంలోని మేళ్లదుప్పలపల్లి ఫామ్‌హౌస్ లోని నీటి కుంటలోనే ఎన్ఆర్ఐ డాక్టర్ జయశీలరెడ్డి మృతదేహం లభ్యమైంది. మూడు రోజుల క్రితం ఆయన ఈ ఫామ్‌హౌస్ కు వెళ్లి కన్పించకుండా పోయాడు. ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ నీటికుంటలో ఆయన డెడ్‌బాడీ లభ్యమైంది.

నల్గొండ: నల్గొండకు సమీపంలోని మేళ్లదుప్పలపల్లి ఫామ్‌హౌస్‌లో అదృశ్యమైన ఎన్ఆర్ఐ డాక్టర్ జయశీలరెడ్డి మృతి చెందాడు. ఫామ్‌హౌస్‌లోని నీటి కుంటలోనే ఆయన డెడ్‌బాడీని మంగళవారం నాడు గుర్తించారు. డాక్టర్ జయశీలరెడ్డి ఎలా మరణించారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

మూడు రోజుల క్రితం దర్వేశిపురం వెళ్లిన డాక్టర్ జయశీలరెడ్డి అక్కడి నుండి తన ఫామ్ హౌస్  ఉన్న మేళ్లదుప్పలపల్లికి వెళ్లాడు. అక్కడే  వాకింగ్ చేసి వస్తానని  కారు డ్రైవర్ మల్లేష్ కు చెప్పి వెళ్లాడు. ఫామ్ హౌస్ లోని కూలీలతో మాట్లాడి వారి వద్ద నుండి కర్ర తీసుకొని  వెళ్లాడు.  ఫామ్ హౌస్‌లో నీటి కుంటలకు సంబంధించిన ఫోటోలను తన బంధువులకు వాట్సాప్ లో షేర్ చేశాడు. ఆ తర్వాతే ఆయన కన్పించకుండా పోయాడు.  

also read:నల్గొండ ఫామ్‌హౌస్‌లో ఎన్ఆర్ఐ డాక్టర్ జయశీల్ రెడ్డి మిస్సింగ్: పోలీసుల గాలింపు

ఫామ్‌హౌస్‌లోకి వెళ్లిన డాక్టర్ జయశీలరెడ్డి ఎంతకీ రాకపోవడంతో డ్రైవర్ మల్లేష్ డాక్టర్ కోసం ఫామ్ హౌస్ లో వెతికాడు. కానీ ఆయన ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో జయశీల రెడ్డి బంధువులకు ఆయన సమాచారం ఇచ్చారు. జయశీలరెడ్డి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజులుగా పోలీసులు డాక్టర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

కానీ ఇవాళ డాక్టర్ జయశీలరెడ్డి డెడ్‌బాడీ ఫామ్‌హౌస్‌లోని కుంట వద్ద లభ్యమైంది. సెల్పీ తీసుకొనే క్రమంలో డాక్టర్ జయశీలరెడ్డి మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు.  ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

డాక్టర్ జయశీలరెడ్డి రేపు అమెరికా వెళ్లాల్సి ఉంది. ఈ లోపుగానే ఆయన మరణించడం ఆ కుటుంబంలో విషాదం నింపింది. జయశీలరెడ్డి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి సమీప బంధువు.

click me!