కొండగట్టులో పవన్ కళ్యాణ్: వారాహి వాహనానికి జనసేనాని ప్రత్యేక పూజలు

By narsimha lodeFirst Published Jan 24, 2023, 12:06 PM IST
Highlights

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని  కొండగట్టు  ఆంజనేయ స్వామి ఆలయంలో   జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  వారాహి వాహనానికి ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో  జనసేన చీఫ్  .పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు  చేరుకున్నారు.  హైద్రాబాద్  నుండి  భారీ కాన్వాయ్  తో  పవన్ కళ్యాణ్  కొండగట్టుకు  చేరుకున్నారు.  కొండగట్టు ఆలయంలో  పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం  వారాహి వాహనానికి  పూజలు చేశారు. ఏపీ రాష్ట్రంలో  త్వరలోనే  బస్సు యాత్ర చేయనున్నారు పవన్ కళ్యాణ్. వారాహి వాహనంలోనే  పవన్ కళ్యాణ్ యాత్ర నిర్వహించనున్నారు.  .    ఇవాళ  మంగళవారం కావడంతో  కొండగట్టు ఆలయానికి భారీ ఎత్తున భక్తులు  హాజరయ్యారు.  కొండగట్టు ఆలయంపైకి  పవన్ కళ్యాణ్  సహ   కొద్ది మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు పోలీసులు.    కొండగట్టు ఆలయంలో ప్రత్యేక పూజలకు  కూడా  పవన్ కళ్యాణ్ సహ ఐదుగురికి మాత్రమే  పోలీసులు  అనుమతిని ఇచ్చారు.  

కొండగట్టు ఆలయానికి చేరుకున్న  పవన్ కళ్యాణ్  కు ఆలయ అధికారులు  ఘనంగా స్వాగతం పలికారు. ఆంజనేయస్వామి ఆలయంలో  పవన్ కళ్యాణ్  ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం  వారాహి  వాహనానికి  వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు చేశారు.  ఆంజనేయస్వామి యంత్రాన్ని  వారాహి వాహనానికి  కట్టారు  వేద పండితులు.  వారాహి  వాహనానికి పూజలు నిర్వహించిన తర్వాత  గుమ్మడికొట్టారు. అనంతరం పవన్ కళ్యాణ్ వాహనం ఎక్కి ప్రజలకు అభివాదం చేశారు.

also read:కొండగట్టుకు బయల్దేరిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అనుష్టుప్ నారసింహాయాత్రకు శ్రీకారం..

పవన్ కళ్యాణ్ కొండగట్టు  పర్యటన నేపథ్యంలో  జగిత్యాల డీఎస్పీ నేతృత్వంలో  సుమారు  200 మందికిపైగా  పోలీసులు  ఆలయం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు.  ఏపీ రాష్ట్రంలో  ఇప్పటికే  ఎన్నికల వేడి రాజుకుంది.  రానున్న ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటానని పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే.   వైసీపీపై  పవన్ కళ్యాణ్  తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. విపక్ష ఓటు బ్యాంకు చీలిపోకుండా  ఉండేందుకు గాను  తన వంతు ప్రయత్నం చేస్తానని కూడా  పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ క్రమంలోనే  ప్రజలను  చైతన్యవంతుల్ని చేయడానికి బస్సు యాత్ర చేయాలని పవన్ కళ్యాణ్  నిర్ణయించుకున్నారు.  గత ఏడాది సెప్టెంబర్ మాసంలోనే  పవన్ కళ్యాణ్  బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. జనవాణి కార్యక్రమాలు  పూర్తి కానుందున  బస్సు యాత్రను వాయిదా వేస్తున్నట్టుగా  అప్పట్లో  పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఇటీవలనే  హైద్రాబాద్ లో  టీడీపీ చీఫ్ చంద్రబాబుతో  పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.  జీవో నెంబర్  1పై ఈ ఇద్దరు నేతలు చర్చించినట్టుగా  ప్రకటించారు.  అయితే  జనసేన, టీడీపీ మధ్య  రానున్న ఎన్నికల్లో పొత్తులుండే అవకాశం లేకపోలేదు.
 

click me!