
కుత్బుల్లాపూర్ పరిధిలోని నిజాంపేటలోని విజ్ఞాన్ పాఠశాలలో చదివే విద్యార్థులకు మే నెలలో సుమారు 25 మంది చిన్నారులకు టిసిలు ఇచ్చేస్తాం... అంటూ వారి తల్లిదండ్రులకు మేనేజ్ మెంట్ నోటీసులు జారీ చేసిందిం. వాట్సాప్, ఫేస్ బుక్ లలో గ్రూపులు ఏర్పాటు చేసుకుని స్కూల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా, టీచర్లను హేళన చేస్తూ ఆయా గ్రూపుల్లో పోస్టులు పెడుతున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్యం పేర్కొంది.
దీనికి విద్యార్థుల తల్లిదండ్రుల వివరణ ఇలా ఉంది. తాము సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్లు చేయలేదని అంటున్నారు. ఏకమొత్తంలో ఉన్న ఫీజును 25శాతం పెంచడాన్ని విద్యార్థుల తల్లిదండ్రులంతా వ్యతిరేకించారని వారు అంటున్నారు. అలాంటి వారిలో సుమారు 150 మంది పిల్లల తల్లిదండ్రులకు నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు. అందులో కొందరు తల్లిదండ్రులు మాత్రం సరెండర్ లెటర్స్ రాసి మేనేజ్ మెంట్ ను రిక్వెస్టు చేసుకుని అదే స్కూల్ లో వారి పిల్లలను కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. మరికొందరు మాత్రం మేనేజ్ మెంట్ చర్యలను నిరసిస్తూ టిసిలు తీసుకొని వెళ్తున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంలో స్థానిక విద్యాశాఖ అధికారులు సైతం మేనేజ్ మెంట్ కే వత్తాసు పలుకుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విజ్ఞాన్ మేనేజ్ మెంట్ దురుసు ప్రవర్తన కారణంగానే తాము టిసిలు తీసుకుని వెళ్తున్నట్లు కొందరు పేరెంట్స్ చెబుతున్నారు.
మొత్తానికి వాట్సాప్ గ్రూపులో పోస్టుల వ్యవహారం అభం శుభం తెలియని చిన్నారులను ఇరకాటంలోకి నెట్టబడింది.