లక్ష ఉద్యోగాలు రాలే.. రూ.3000 భృతి ఇయ్యలే.. : సీఎం కేసీఆర్ స‌ర్కారుపై బండి సంజ‌య్ ఫైర్

Published : Oct 03, 2023, 03:56 PM IST
లక్ష ఉద్యోగాలు రాలే.. రూ.3000 భృతి ఇయ్యలే.. : సీఎం కేసీఆర్ స‌ర్కారుపై బండి సంజ‌య్ ఫైర్

సారాంశం

Hyderabad: తెలంగాణ బీజేపీ మాజీ అధ్య‌క్షుడు, ఎంపీ బండి సంజ‌య్ మ‌రోసారి భారత రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) అధినేత‌, ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావును టార్గెట్ చేస్తూ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. బీఆర్ఎస్ పాల‌న‌లో రాష్ట్రానికి పెద్ద‌గా ఒరిగిందేమీ లేద‌ని మండిప‌డ్డారు. ''లక్ష ఉద్యోగాలు రాలే,. రూ. 3000 భృతి ఇయ్యలే.. రైతుల ఆత్మహత్యల ఆగలే, పోడు పంచాయతీ పోలేదంటూ'' దుయ్య‌బ‌ట్టారు.   

BJP leader, Karimnagar MP Bandi Sanjay Kumar: తెలంగాణ బీజేపీ మాజీ అధ్య‌క్షుడు, క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ కుమార్ మ‌రోసారి భారత రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) అధినేత‌, ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్)ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. బీఆర్ఎస్ పాల‌న‌లో రాష్ట్రానికి పెద్ద‌గా ఒరిగిందేమీ లేద‌ని మండిప‌డ్డారు. ''లక్ష ఉద్యోగాలు రాలే,. రూ. 3000 భృతి ఇయ్యలే.. రైతుల ఆత్మహత్యల ఆగలే, పోడు పంచాయతీ పోలేదంటూ'' దుయ్య‌బ‌ట్టారు. తెలంగాణ‌లో అధికారంలోకి రావ‌డానికి ఎన్నిక‌ల స‌మ‌యంలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీల‌ను ప్ర‌స్తావిస్తూ ప‌లు ప్ర‌శ్న‌ల‌తో గుప్పించ‌డంతో పాటు ఘాటు విమ‌ర్శ‌లు చేశారు.

ప‌రోక్షంగా బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ క‌విత‌ల గురించి ప్ర‌స్తావిస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు. 'పాపం కారు గ్యారేజీకి పోతోందని #TwitterTillu నారాజ్‌ అయితున్నడు.. నిజామాబాద్‌ల చెల్లె ఓటమి ఖాయమైందని ముందే ఆగమైతున్నడు, కానీ ఏం ఫాయిదా? తొమ్మిదేళ్ల మీ దొంగ హామీల దొంగ జపం బట్టబయలైంది. వరంగల్‌ డల్లాస్‌ కాలే.. కనీసం బస్టాండ్‌ కూడా రాలే. వరదలు, బురదలు బోనస్ గా వ‌చ్చాయంటూ' విమ‌ర్శించారు. అలాగే, 'నిజామాబాద్‌లో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకోలే.. 100 కుటుంబాలు కూడా బాగుపడలే.. 100 ఏళ్లకు సరిపడా దోపిడీ మాత్రం జరిగిందని' దుయ్య‌బ‌ట్టారు. 

ఆరోగ్య సేవ‌ల గురించి ప్ర‌స్తావిస్తూ.. 'ఆదిలాబాద్‌కు ఎయిర్‌ అంబులెన్స్‌లు రాలే.. కనీసం అంబులెన్స్‌ పోయే తోవ కూడా ఎయ్యలే. గతి లేక గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు మాత్రం ఎక్కువైనయి. కరీంనగర్‌ లండన్ కాలే.. వేములవాడకు ఏటా రూ.100 కోట్లు అందలే. కొండగట్టు అంజన్న ఘాట్‌రోడ్డు గతి మారలే గులాబీ కబ్జాకోర్లు, కీచకులు మాత్రం పెరిగారు' అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఉద్యోగాల భ‌ర్తీ, ఉద్యోగ క‌ల్ప‌నను గురించి ప్ర‌స్తావిస్తూ.. 'లక్ష ఉద్యోగాలు రాలే,  రూ. 3000 భృతి ఇయ్యలే, రైతుల ఆత్మహత్యల ఆగలే, పోడు పంచాయతీ పోలే, ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ కాలే - పదోన్నతులు పూర్తిగాలే.. కొత్త పీఆర్‌సీ అమలు నోచుకోలే - ఠంచనుగా జీతాలు రాలేదంటూ విమ‌ర్శించారు.

అలాగే, ''తొమ్మిదేండ్లలో కల్వకుంట్ల ఖజానా నిండిందనీ, కల్వకుంట్ల భజనకారులకు కోట్ల కమీషన్లు అందినయి తప్ప కష్టపడి కొట్లాడిన తెలంగాణ ప్రజలకు ఒరిగిందేం లేదు. తొమ్మిదేండ్లు గాడిద పండ్లు తోమి, ఇప్పుడు గాయి చేస్తే నమ్మేందుకు తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. దొంగ హామీలు, దగా మాటలు, దౌర్జన్య చేతలకు కాలం చెల్లిందని బండి సంజ‌య్ ఆరోపించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

పోక్సో చట్టం యొక్క భయంకరమైన నిజాలు | Advocate Allam Nagarju On POCSO | Asianet News Telugu
Advocate Allam Nagaraju On bandi Sanjay Son Issue : అప్పుడు భగీ ..ఇప్పుడు బొగ్గు అయ్యిండా??