
పెద్ద నోట్ల రద్దుతో దేశం అంతా గగ్గోలు పెడుతోంది.. సామాన్య జనం రోజు గడవడానికే నానా కష్టాలు పడుతోంది.పెద్ద పెద్ద సంస్థలు కూడా నోట్ల దెబ్బకు అమ్మకాలు లేక గోల్లు గిళ్లుకుంటున్నాయి.
ఇక కార్ల సంస్థలైతే అమ్మకాలు లేక గోదాముల్లోని కార్లను బయటకు తేవడం కూడా లేదు.పెద్ద నోట్లు రద్దైన ఈ 15 రోజుల్లో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 70 శాతం అమ్మకాలు నిలిచిపోయాయి.కొందరైతే కార్ల డీలర్షిప్లను కూడా నోట్ల దెబ్బకు రద్దు చేసుకోవాల్సి వస్తుందని భయపడుతున్నారు.
నోట్ల రద్దుకు ముందు ప్రతినెలా తెలంగాణలో 40 వేల కార్లు, ఏపీలో 25 వేల కార్లు వరకు సగటునే అమ్మేవారు. 24 వ తేదీ వరకు కార్లుకు సంబంధించిన లైఫ్ టాక్స్ ను పాత నోట్లతోనే కట్టొచ్చని ప్రభుత్వాలు ప్రకటించడంతో ఈ మేరకైనా కొంత వరకు అమ్మకాలు జరుగుతున్నాయి.
అయితే 24వ తేదీ పరిస్థితి ఏంటి అని కార్ల డీలర్ షిప్ యజమానులు భయపడుతున్నారు.వాహనాల కొనుగోళ్ల వ్యవహారాలు అధిక భాగం నగదుతోనే జరుగుతాయి. ఏంత చిన్న కారైన రూ. 2.50 లక్షల కంటే తక్కువగా ఉండదు.
ఈ నేపథ్యంలో అంత మొత్తాన్ని నగదుగా చెల్లింస్తే ఇన్ కం టాక్స్ ఇబ్బందులు తప్పవు . ఈ నేపథ్యంలో కార్ల కొనుగోళ్లను చాలా మంది వాయిదా వేసుకుంటున్నారు. ఇలా కార్ల కొనుగోళ్లు ఒక్కసారిగా పడిపోవడంతో రవాణా శాఖ కూడా భారీగా ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోంది.
ఈ నేపథ్యంలో కార్ల అమ్మకాలను కొనసాగించేందుకు కొన్ని కార్ల డీలర్లు ధర తగ్గించేందుకు సిద్ధమయ్యాయి. కొన్ని డీలర్లు కొత్త ఆఫర్ల తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి.గతంలో తమ దగ్గరికి వచ్చిన వినియోగదారులకు ఎస్ఎంఎస్ లు చేసి మరీ కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అయినా కూడా వినియోగదారులను నుంచి పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో కార్ల డీలర్లు కుదేలవుతున్నారు.