సోదరి రాధిక ఫ్యామిలీ మృతి: అదృశ్యంపై ఎమ్మెల్యేకు ముందే తెలిసినా... అనుమానాలు

By narsimha lodeFirst Published Feb 18, 2020, 1:01 PM IST
Highlights

కరీంనగర్ జిల్లా కాకతీయ కాలువలో కారు పడిన ఘటనలో రాధిక కుటుంబం మృతి చెందింది. రాధిక కుటుంబం 20 రోజులుగా కన్పించకుండా పోయిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతోంది. 

కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాకతీయ కెనాల్‌లో  ప్రభుత్వ టీచర్‌ రాధిక, సత్యనారాయణ రెడ్డి దంపతులతో పాటు వాళ్ల కూతురు సహస్ర మృతి చెందిన ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  

రాధిక కుటుంబం ఫోన్ స్విచ్ఛాప్ వచ్చిన రోజునే ఇంటి తాళాలు పగులగొట్టి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చూసినట్టుగా సత్యనారాయణ రెడ్డి షాపులో పనిచేసే నర్సింగ్ చెప్పారు.

 ఈ ఏడాది జనవరి 26వ తేదీన తనకు సత్యనారాయణ రెడ్డి ఫోన్ చేశారని ఆయన గుర్తు చేసుకొన్నారు. ఇంట్లో ఉన్న సామాన్లను తనతో కారులో పెట్టించాడన్నారు. టూరుకు వెళ్తున్నామని తనతో చెప్పారని ఆయన తెలిపారు.

Also read:ఎమ్మెల్యే సోదరి కారు ప్రమాదంపై వీడిన మిస్టరీ

టూరుకు వెళ్లే సమయంలో రాధిక పోన్‌లో బ్యాలెన్స్ లేదని తనకు పోన్ చేసి రీ ఛార్జీ చేయించాలని సత్యనారాయణ రెడ్డి కోరాడన్నారు. సత్యనారాయణ రెడ్డి కోరిక మేరకు నర్సింగ్ రాధిక ఫోన్‌కు రీ ఛార్జీ చేయించాడు. ఆ తర్వాత కూడ సత్యనారాయణ రెడ్డితో నర్సింగ్ ఫోన్‌లో మాట్లాడినట్టుగా  ఓ తెలుగు న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నర్సింగ్  చెప్పారు.

జనవరి 28వ తేదీన సత్యనారాయణరెడ్డితో పాటు కుటుంబసభ్యుల ఫోన్లు కూడ స్విచ్ఛాప్ రావడంతో తాను ఈ విషయాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి సమాచారం ఇచ్చినట్టుగా ఆయన మీడియాకు తెలిపాడు.

అయితే ఈ విషయ తెలిసిన తర్వాత పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి రాధిక ఇంటి తాళాలు పగులగొట్టి   చూసినట్టుగా నర్సింగ్ చెప్పారు. అయితే  ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తారని తాను భావించానన్నారు. కానీ, తాను ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇవ్వలేదన్నారు. 

టూరుకు వెళ్లే ముందు కూడ ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కొంత కాలం క్రితమే సత్యనారాయణ రెడ్డి కొడుకు కూడ మృతి చెందాడని నర్సింగ్ చెప్పారు.  కొడుకు మృతి చెందిన తర్వాత  సత్యనారాయణ రెడ్డి రియల్ ఏస్టేట్ వ్యాపారాన్ని తగ్గించినట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు. 

జనవరి 28వ తేదీ నుండి సత్యనారాయణ రెడ్డి కుటుంబం కన్పించకుండా పోయినా కూడ ఎందుకు పోలీసులకు సమాచారం ఇవ్వలేదనే విషయమై అందరూ ప్రశ్నిస్తున్నారు. సత్యనారాయణరెడ్డి కుటుంబానికి ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేవని పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పోలీసులకు చెబుతున్నారు.

 


 

click me!