రాజాసింగ్ హెచ్చరికలు, బీజేపీ శ్రేణుల ఆందోళనలు.. ప్రశాంతంగానే ముగిసిన మునావర్ కామెడీ షో

By Siva KodatiFirst Published Aug 20, 2022, 8:59 PM IST
Highlights

మునావర్ ఫారూఖీ కామెడీ షో హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రశాంతంగా ముగిసింది. అంతకుముందు ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు హైదరాబాద్ నలుమూలల నుంచి యువత పెద్ద సంఖ్యలో శిల్పకళా వేదిక వద్దకు చేరుకున్నారు

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరికలు, ఆ పార్టీ కార్యకర్తల ఆందోళనల నడుమ హైదరాబాద్ శిల్పకళా వేదికలో మునావర్ కామెడీ షో ముగిసింది. అంతకుముందు ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు హైదరాబాద్ నలుమూలల నుంచి యువత పెద్ద సంఖ్యలో శిల్పకళా వేదిక వద్దకు చేరుకున్నారు. అటు రాజాసింగ్ హెచ్చరికల నేపథ్యంలో వేదిక వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. షోను అడ్డుకునేందుకు యత్నించిన పలువురు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించారు. వారి వెంట సెల్‌ఫోన్లు, వాటర్ బాటిళ్లను అనుమతించలేదు. మొత్తం మీద షో ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 

Also REad:రాజాసింగ్ హెచ్చరికలు.. పోలీస్ యూనిఫాంలో మునావర్ షోలోకి బీజేపీ కార్యకర్త , చితకబాదిన పోలీసులు

ఇకపోతే.. మునావర్ ఫరూఖీని వేదిక వద్దే దాడి చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు. ధర్మం కోసం అవసరమైతే పార్టీకి కూడా దూరమయ్యేందుకు తాను సిద్దంగా ఉన్నానని కూడా రాజాసింగ్ తేల్చి చెప్పారు. చాలా రాష్ట్రాల్లో మునావర్ ఫరూఖీ షో లను ప్రభుత్వాలు రద్దు చేశాయన్నారు. అన్ని పార్టీలు కూడా ఈ విషయమై ఏకతాటిపైకి రావడంతో చాలా ప్రభుత్వాలు ఈ నిర్ణయాలు తీసుకున్నాయన్నారు. కానీ తెలంగాణలో మాత్రం ఎందుకు మునావర్ ఫరూఖీ షో ని ప్రభుత్వం అనుమతించిందో చెప్పాలని ఆయన కోరారు. రాముడి, సీతను దూషించిన మునావర్  ఫో ను రాష్ట్రంలో నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడ ఆయన ప్రశ్నించారు. మునావర్ కాకుండా వేరే హాస్య కళాకారుడితో షో నిర్వహిస్తే  ఆ కార్యక్రమంలో తాము పాల్గొంటామన్నారు. కానీ ఈ షోకి అనుమతివ్వద్దని తాము  కోరినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
 

click me!