
రక్షాభందన్ సందర్భంగా సోదరులకు రాఖీ కట్టడమే కాదు, వారి క్షేమం కోసం హెల్మెట్లను కూడా గిఫ్ట్ గా ఇవ్వాలంటూ ఎంపీ కల్వకుంట్ల కవిత గత ఏడాది ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే మళ్లీ రాఖీ పండగ త్వరలో ఉండటంతో కవిత మరోసారి ఆ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తన ట్వట్టర్ లో సిస్టర్స్ ఫర్ చేంజ్ పేరుతో సోదరులకు హెల్మెట్లు గిప్ట్ గా ఇవ్వాలంటూ మళ్లీ ప్రచారాన్ని మొదలుపెట్టారు.
అయితే కవిత పెట్టిన ట్వీట్ పై హైదరాబాద్ డిప్యూటి మేయర్ బాబా పసియుద్దిన్ స్పందించారు. తానెప్పుడూ హెల్మెట్ ధరించే ద్విచక్రవాహనాన్ని డ్రైవ్ చేస్తానంటూ హెల్మెట్ ధరించిన ఓ పోటోతో జతచేసి ట్వీట్ చేశారు. దీనికి ''గుడ్ జాబ్ బాబా...ఇలాగే హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని ప్రచారం కల్పంచడంతోపాటు ఇలా నిబంధనలు పాటించేవారిని ప్రోత్పహించండి'' అంటూ కవిత రిప్లై ఇచ్చారు.
గత సంవత్సరం ఈ హెల్మెట్ క్యాంపెయిన్ పై ఎంపి కవిత విస్తృతంగా ప్రచారం చేశారు. అంతే కాకుండా స్వయంగా తన సోదరుడు కేటీఆర్ కు హెల్మెట్ ని గిప్ట్ గా ఇచ్చి ఆశ్చర్యానికి గురిచేశారు. మళ్లీ అదే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఎంపి కవిత ప్రయత్నిస్తున్నారు.