
Telangana Health Minister Harish Rao: ఇప్పటివరకు ఆఫ్రికా దేశాలకు మాత్రమే పరిమితమైన మంకీపాక్స్ కేసులు ఇప్పుడు ఇతర దేశాల్లో కూడా నమోదవుతున్నాయి. ఆఫ్రికా దేశాల తర్వాత ఇటీవల కాలంలో ఆమెరికా, పలు యూరప్ దేశాల్లో మంకీపాక్స్ కేసులను గుర్తించారు. ఈ కేసులు క్రమంగా పెరుగుతున్నాయనే రిపోర్టుల మధ్య ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) అన్ని దేశాలను హెచ్చరించింది. మంకీపాక్స్ నివారణ చర్యలను ప్రస్తావించింది. ఇప్పటికే చాలా దేశాలు మంకీపాక్స్ కేసులు గుర్తించడంతో మరోసారి హెల్త్ ఎమర్జెన్సీ తప్పదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇలాంటి ఆందోళనకర పరిస్థితుల మధ్య భారత్ లోకి కూడా మంకీపాక్స్ ప్రవేశించింది. కేరళలో రెండు కేసులను గుర్తించారు. అలాగే, దేశంలోని పలు రాష్ట్రాల్లో అనుమానిత కేసులు ఉన్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కారు మంకీపాక్స్ విషయంలో ప్రజలను హెచ్చరించింది. పొరుగున ఉన్న కేరళలో రెండు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయనీ, వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కోరారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఒక్క మంకీపాక్స్ కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి టీ హరీశ్రావు సోమవారం ఐఐఎఫ్హెచ్, వెంగళ్రావునగర్ నుంచి డీఎంఈ, టీవీవీపీ వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో మంకీపాక్స్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా, వ్యాధి లక్షణాలు, పరీక్షలు, గుర్తింపు, చికిత్సపై అవగాహన కల్పించేందుకు ఈ సమావేశం జరిగింది.
ఈ క్రమంలోనే మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. మంకీపాక్స్పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 60కి పైగా దేశాల్లో దాదాపు 1,20,000 కేసులు నమోదైనప్పటికీ కేరళలో కేవలం రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రం ఏ అనుమానితుడిని కూడా చూడలేదని తెలిపారు. ఎలాంటి కేసులు నమోదు కానప్పటికీ మంకీపాక్స్ వ్యాధిపై వైద్య, ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు (కేసీఆర్) ఆదేశాల మేరకు వివిధ దేశాల్లో నమోదవుతున్న వ్యాధిపై అధ్యయనం చేస్తున్నామని, డబ్ల్యూహెచ్వో, ఐసీఎంఆర్ మార్గదర్శకాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని మంత్రి తెలిపారు.
గాంధీ ఆసుపత్రిలో రోగ నిర్ధారణ కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా, అనుమానిత కేసుల తక్షణ చికిత్స కోసం ఫీవర్ ఆసుపత్రిని నోడల్ ఆసుపత్రిగా నియమించారు. అవసరమైన ఏర్పాట్లు చేశామని మంత్రి హరీశ్రావు తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించి పాజిటివ్ స్ట్రెయిన్ నిర్ధారణ కోసం నమూనాలను పూణెలోని ల్యాబ్కు పంపుతామని చెప్పారు. మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు, పరీక్షలు, చికిత్సపై వైద్యులందరూ అవగాహన పెంచుకోవాలని, క్షేత్రస్థాయి సిబ్బందికి వివరించాలని మంత్రి సూచించారు. వైరస్కు సంబంధించిన అనుమానిత లక్షణాలను గుర్తించిన వెంటనే బాధితుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాలని మంత్రి తెలిపారు.
"ఏదైనా లక్షణాలు గమనించినట్లయితే, వారు వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ప్రాథమిక పరీక్షలు చేయించుకోవాలి" అని మంత్రి హరీశ్ రావు తెలిపారు. అలాగే, సీజనల్ వ్యాధులు, మంకీపాక్స్, టీకాలు, ఆరోగ్య వివరాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో సలహాల కోసం 04024651119, 9030227324 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త వహించండి, వర్షాలు, వరదల దృష్ట్యా సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉందని, వచ్చే వారం పది రోజుల పాటు అన్ని ఆస్పత్రుల్లో అప్రమత్తంగా ఉండాలని వైద్యులకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సూచించారు. “అవసరమైతే, ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించడానికి OP సమయాన్ని పెంచాలి. అన్ని ఆసుపత్రుల్లో సూపరింటెండెంట్లు ఎప్పటికప్పుడు సమస్యలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు. రోగులకు మంచి వైద్యసేవలు అందేలా చూసుకోండి” అని ఆరోగ్య మంత్రి హరీశ్ రావు అన్నారు.