శాసనసభ్యురాలు కొండా సురేఖకు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాయకులు పొమ్మనలేక పొగ పెడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. డిప్యూటీ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఎదుటే ఆమెకు ఘోరమైన అవమానం జరిగింది.
వరంగల్: శాసనసభ్యురాలు కొండా సురేఖకు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాయకులు పొమ్మనలేక పొగ పెడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. డిప్యూటీ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఎదుటే ఆమెకు ఘోరమైన అవమానం జరిగింది. టీఆర్ఎస్ తో ఆమెకు దూరం పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కొండా సురేఖకు, వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరు కూడా శాసనసభ టికెట్ ఆశిస్తున్నారు. ఇటీవల వారిద్దరు బహిరంగంగానే పరస్పరం విమర్శలు చేసుకున్నారు
తనకు అందిన ఆహ్వానం మేరకు ఇటీవల కొండా సురేఖ వరంగల్ శివారంలో గల తిమ్మాపురంలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమానికి వెళ్లారు. అతిథులందరూ మొక్కలు నాటిన తర్వాత సమావేశం జరిగింది. వేదిక మీదికి సురేఖను అహ్వానించలేదు.
కడియం శ్రీహరితో పాటు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, జడ్పీ చైర్ పర్సన్ గద్దల పద్మ, కలెక్టర్ ఆమ్రపాలి, గుండు సుధారాణి, కుడ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, కార్పోరేటర్ చింతల యాదగిరి, పోలీసు కమిషనర్ వి. రవీందర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అక్కడికి వచ్చిన సురేఖను పట్టించుకున్నవాళ్లే లేరు. ఆమెకు ఎవరూ ఆహ్వానం పలుకలేదు. మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా ఆమెను పిలువలేదు. తనకు నిర్దేశించి స్థలంలో తన అనుచరులతో కలిసి ఆమె మొక్కలు నాటారు. తనను వేదిక మీదికి ఆహ్వానిస్తారనే ఉద్దేశంతో నిరీక్షించారు. తాను నిలుచుండగానే వేదిక మీది నుంచి ప్రసంగాలు ప్రారంభమయ్యాయి. దాంతో ఆమె ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధపడ్డారు.
తిమ్మాపురం తన నియోజకవర్గం పరిధిలో లేదు కాబట్టి ప్రొటోకాల్ సమస్య తలెత్తదని, తనకు చాలా అత్యవసరమైన ఉన్నందున వెళ్లిపోతున్నానని ఆమె మీడియాతో చెప్పారు.