టెన్త్ పేపర్ లీక్ .. పోలీసులకు చెప్పాలిగానీ, మీడియాకు చెబుతారా.. కుట్ర వుండబట్టే : బీజేపీపై శ్రీనివాస్ గౌడ్

Siva Kodati |  
Published : Apr 05, 2023, 04:26 PM IST
టెన్త్ పేపర్ లీక్ .. పోలీసులకు చెప్పాలిగానీ, మీడియాకు చెబుతారా.. కుట్ర వుండబట్టే : బీజేపీపై శ్రీనివాస్ గౌడ్

సారాంశం

టెన్త్ పేపర్ లీక్ చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని బీజేపీ నేతలు అభాసుపాలు చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్. పేపర్ లీక్ గురించి తెలిసినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి కదా అని ఆయన ప్రశ్నించారు. 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టెన్త్ పేపర్ లీక్ ఘటనపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. దీని వెనుక ఎంతటివారున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ.. తెలంగాణ దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ పథకాలను ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని.. రాజకీయాల కోసమే బీజేపీ నాయకులు పేపర్ లీక్ చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. దీంతో పిల్లలు, ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

పదో తరగతి హిందీ పేపర్ లీక్ చేసిన నాయకుడు.. దానిని వెంటనే ఆ పార్టీ అధ్యక్షుడికి పంపించడం, మీడియాకు సమాచారం అందించడం కుట్రలో భాగమేనని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. లీకైన పేపర్‌ను వందలాది వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి విద్యార్ధులను భయాందోళనలకు గురిచేశారని ఆయన మండిపడ్డారు. పేపర్ లీక్ గురించి తెలిసినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి కదా అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. మీడియాకు సమాచారం అందించి రాద్ధాంతం చేశారంటూ దాని వెనుక కుట్ర వుందని ఆయన అన్నారు. 

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ నిందితుడు కూడా బీజేపీ కార్యకర్తేనని.. ఇప్పుడు టెన్త్ పేపర్ లీక్ పేరిట మరోసారి బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేపర్ లీక్ సర్వసాధారణమని ఆయన అన్నారు. తెలంగాణ పోలీస్ వ్యవస్థ అత్యంత బలమైనదన్న మంత్రి.. ఇలాంటి కుట్రదారులను వెంటనే అరెస్ట్ చేసినట్లు గుర్తుచేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం .. ప్రైవేటీకరణ పేరుతో వున్న ఉద్యోగాలను కూడా లేకుండా చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రాభివృద్ది కోసం దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని మంత్రి డిమాండ్ చేశారు. 

ALso Read: కరీంనగర్‌ పోలీసు స్టేషన్‌లో బండి సంజయ్‌పై కేసు నమోదు.. వివరాలు ఇవే..

ఇదిలావుండగా..  తెలంగాణ పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజ్ కేసుకు సంబంధించి టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌‌ను అరెస్ట్ చేయడం తీవ్ర సంచలనంగా మారింది. బండి సంజయ్‌ను ఈ కేసులో నిందితుల జాబితాలో చేర్చారు. ఆయనపై ఐపీసీ సెక్షన్ 420, సెక్షన్ 6 ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేశారు. అలాగే ఈ కేసులో నిందితునిగా ప్రశాంత్.. బండి  సంజయ్‌ల మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌ను పోలీసులు రిట్రీవ్ చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రశాంత్ నుంచి బండి సంజయ్‌కు పెద్ద ఎత్తున కాల్స్ వెళ్లినట్టుగా కూడా తెలుస్తోంది. పేపర్ లీక్ జరగడానికి ముందు రోజు బండి సంజయ్‌తో ప్రశాంత్ ఫోన్‌లో మాట్లాడినట్టుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అలాగే మంగళవారం రోజున బండి సంజయ్‌ను పేపర్ పంపిన తర్వాత కూడా ప్రశాంత్ ఆయన‌తో మాట్లాడినట్టుగా గుర్తించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Revanth Reddy: తల్లితండ్రులకు జీవనాధారం లేకుండా చేస్తే జీతంలో 15శాతం కట్ చేస్తా| Asianet News Telugu
KTR Meets Newly Elected BRS Sarpanches in MBNR | KTR Comments on Revanth Reddy | Asianet News Telugu