
కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి (telangana agriculture minister) నిరంజన్ రెడ్డి (niranjan reddy ). గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం అవలంబిస్తోన్న విధానాల వల్ల రైతులు బాధపడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అనేక శాఖలు తెలంగాణ పురోగతిని ప్రశంసించాయని మంత్రి గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాజ్యంగపరమైనదే అనే విషయాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు మర్చిపోతున్నారని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.
కేంద్రంలోని బీజేపీ.. కార్పొరేట్ కంపెనీలకు ఏమైనా చేస్తోందని.. దగ్గరుండి మరీ కంపెనీలకు ఒప్పందాలు కుదుర్చి ఇస్తోందని ఆయన ఆరోపించారు. మరి రైతులను ఎందుకు విస్మరిస్తోందని నిరంజన్ రెడ్డి నిలదీశారు. ధాన్యం సమస్య పరిష్కారం కోసం ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నామని.. రెండు రోజుల్లో నిర్ణయం చెప్తామని ఇంత వరకు చెప్పలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఏదో ప్రేమలేఖలు రాసేందుకు ఢిల్లీకి వచ్చినట్లు కేంద్ర మంత్రులు భావిస్తున్నారంటూ సెటైర్లు వేశారు.
ALso read:వరి వార్.. తెలంగాణలో ముదురుతున్న ధాన్యం కొనుగోళ్ల వివాదం.
దాదాపు 20 ఉత్పత్తులకే కేంద్రం నామమాత్రపు ఎంఎస్పీ ఇస్తోందని... స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని ప్రధాని మోడీ (narendra modi) చెప్పారని ఎద్దేవా చేశారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించడం లేదని.. యూపీ, పంజాబ్ రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సాగు చట్టాలను (farm laws) వెనక్కి తీసుకున్నారని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని మోదీ హామీ ఇచ్చారని... బ్యాంకు రుణాలు ఎగవేస్తున్న పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
రైతులు, కొత్తతరం వారు వ్యవసాయాన్ని విడిచిపెట్టేలా మోదీ వ్యవహరిస్తున్నారని.. సాగుని ప్రోత్సహిస్తే రాష్ట్రంలో యాసంగిలోనూ 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని నిరంజన్ రెడ్డి తెలిపారు. గుజరాత్లో సాగుకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఏ విషయంలోనూ కేంద్రం నుంచి సరైన విధంగా సాయం అందడం లేదని... రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ నిధులను (gst funds) కూడా అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని మంత్రి మండిపడ్డారు.
కేంద్రం నిర్వర్తించాల్సిన బాధ్యతను వదిలేసి.. రాష్ట్రాలపైకి దాడి చేయడం ఏంటని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. అడిగేందుకు వచ్చిన రాష్ట్రాల నేతలను అవమానిస్తున్నారని... ప్రధాన మంత్రితో మాట్లాడి.. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించలేరా అని కిషన్ రెడ్డిని (kishan reddy) ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం తన వైఖరేంటో ఇప్పటికైనా స్పష్టంగా చెప్పాలి అని నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు.