
హైదరాబాద్ మెట్రో విస్తరణకు సంబంధించి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరికి తెలంగాణ మంత్రి కేటీఆర్ సోమవారం లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ కింద నిర్మించ తలపెట్టిన బీహెచ్ఈఎల్- లక్డీకపూల్, నాగోల్- ఎల్బీనగర్ మెట్రో విస్తరణకు నిధులు అందించాలని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. ఇందుకోసం రూ.8,453 కోట్లు ఖర్చవుతుందని.. దీని నిమిత్తం 2023- 24 కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని కేటీఆర్ కోరారు. సెకండ్ ఫేజ్లో 31 కి.మీల మేర మెట్రోను నిర్మించనున్నారు. ఇందులో బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకాపూల్ వరకు 26 కి.మీ మేర మార్గం వుంటుందని.. ఇందులో 23 స్టేషన్లు వుంటాయన్నారు.. నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు నిర్మించే మార్గంలో 4 మెట్రో స్టేషన్లు వుంటాయని కేటీఆర్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
అంతకుముందు ఆదివారం హైదరాబాద్ లో జరిగిన సీఐఐ సదరన్ రీజియన్ కౌన్సిల్ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రయాణం (కథ) ఇప్పుడే మొదలైందని అన్నారు. వ్యాపారాన్ని సులభతరం చేయడమే కాకుండా, నేడు పరిశ్రమ వ్యాపారం చేయడానికి అయ్యే ఖర్చును తగ్గించడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కంపెనీలు క్వాలిటీ, కాస్ట్ పోటీ ఇంటర్న్ లుగా ఉండాలని అన్నారు. హైదరాబాద్ లో 19,000 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్, ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేషన్ సెంటర్-టీ హబ్, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రొటోటైయింగ్ సెంటర్- టి-వర్క్స్ ఉన్నాయని తెలిపారు.
Also Read:దేశంలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కొరవడిందన్న మంత్రి కేటీఆర్
ఇప్పుడు పెట్టుబడికి కొరత లేనందున సాహసోపేతమైన చర్యలు తీసుకోవాలని ఆయన పరిశ్రమ నాయకులను కోరారు. 'జీవశాస్త్రం సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిపే నగరం హైదరాబాద్. జీనోమ్ వ్యాలీ తెలంగాణ గర్వించదగిన గమ్యస్థానాలలో ఒకటి.. ఇప్పుడు మనకు పటాన్ చెరులో మెడ్ టెక్ పార్క్ కూడా ఉంది. ఇక్కడ ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ తయారీ సదుపాయం ఉంది. ప్రపంచంలోని మానవ వ్యాక్సిన్లలో మూడింట ఒక వంతు తెలంగాణలో తయారవుతున్నాయి. మన రాష్ట్రం పెట్టుబడులకు అత్యంత ప్రగతిశీలమైన.. ఆకర్షణీయమైన గమ్యస్థానంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం శ్వేత విప్లవం, చేపలు/ మాంసం విప్లవం, పసుపు విప్లవం (పామాయిల్) పై దృష్టి సారించిందనీ, దీనిలో సమీప భవిష్యత్తులో వృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.