హుజూర్‌నగర్ విజయం: బీజేపీది గాలివాటమే.. ఆ పార్టీ అసలు బలం ఇదేనన్న కేటీఆర్

By Siva KodatiFirst Published Nov 4, 2019, 6:32 PM IST
Highlights

గత కొంత కాలంగా బిజెపి చేస్తున్న మాటల హడావిడి ప్రచారాపటోపం తేలిపోయిందన్నారు. గత ఎన్నికల్లో  బిజెపి గెలిచిన స్థానాలు గాలివాటమే అని, ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో ఉన్న అసలైన బలం ఏమిటో ప్రజలు  మరి ఓటు గుద్ది మరీ తెలియజెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు

హుజూర్‌నగర్ నియోజకవర్గంలో సాధించిన విజయం పార్టీకి టానిక్ లాంటిదని, కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. హుజూర్ నగర్ నియోజకవర్గ ఎన్నికలో పార్టీ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో ఆయన సోమవారం సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ సాధించిన విజయంతో ప్రతిపక్షాలు ఇన్నాళ్లుగా చేస్తూ వచ్చిన దుష్ప్రచారాలు, అసత్య ఆరోపణలు, లేవనెత్తిన అర్ధరహిత ప్రశ్నలకు సమాధానం ప్రజలే చెప్పారని కేటీఆర్ అన్నారు.

ఈ విజయం ద్వారా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వం పైన ఉన్న అచంచల విశ్వాసానికి నిదర్శనంగా నిలిచిందని మంత్రి గుర్తు చేశారు. ఈ ఎన్నిక ద్వారా ఏ పార్టీ బలం ఎంతో తేలిపోయిందని, స్వయంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి సొంత నియోజకవర్గంలోనూ ప్రజలు కాంగ్రెస్‌ని తిరస్కరించారని ఆయన గుర్తుచేశారు.

Also read:ఆర్టీసీ సమ్మెపై వీడని కేసీఆర్ పట్టు: కాంగ్రెసులో హుజూర్ నగర్ సెగ

గత కొంత కాలంగా బిజెపి చేస్తున్న మాటల హడావిడి ప్రచారాపటోపం తేలిపోయిందన్నారు. గత ఎన్నికల్లో  బిజెపి గెలిచిన స్థానాలు గాలివాటమే అని, ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో ఉన్న అసలైన బలం ఏమిటో ప్రజలు  మరి ఓటు గుద్ది మరీ తెలియజెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు.

ఈ ఎన్నికతో తెలంగాణ రాష్ట్ర సమితి పైన, పార్టీ శ్రేణులపైన మరింత భాద్యత పెరిగిందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికల వేళ ఇచ్చిన హమీలను నెరవేర్చి, హూజుర్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి, అక్కడ ప్రజల రుణం తీర్చుకోవాలన్నారు.

ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అక్కడ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రత్యేక కృషి చేయాలన్నారు. ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించి, రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇలాంటి విజయమే సాధించాలని కోరారు.

Also read:హుజూర్‌నగర్‌కు రూ.100 కోట్లు, ఆర్టీసీకి రూ. 47 కోట్లివ్వలేరా?: హైకోర్టు

మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకొని ప్రణాళికాబద్ధంగా పక్కా వ్యూహంతో ముందుకు పోవాలని కేటీఆర్ సూచించారు. ఈ సమావేశంలో మాట్లాడిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్ పార్టీ విజయం కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రతి ఒక్కరిలోనూ ముఖ్యమంత్రి కేసిఆర్ పట్ల, ఆయన నాయకత్వం పట్ల, ఆయన చేస్తున్న కార్యక్రమాల పట్ల అపూర్వమైన స్పందన లభించిందని, అందుకే కేసిఆర్ పరిపాలనకు ఓటేసి పట్టం కట్టారని కొనియాడారు. ఈ ఎన్నికలు ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వానికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యూహానికి దక్కిన ఫలితంగా వారు అభివర్ణించారు.  

click me!