
మెదక్ వేదికగా రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి శంఖారావాన్ని పూరిస్తారని అన్నారు మంత్రి హరీశ్ రావు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ వ్యూహం ఎవరూ ఊహించలేరని అన్నారు. సీట్ల ప్రకటనతో విపక్షాలు కకావికలం అయిపోయాయని వ్యాఖ్యానించారు. మెదక్లో పదికి పది సీట్లు గెలిచి సీఎంకు కానుకగా ఇస్తామన్నారు. బీజేపీకి కేడర్ లేదు.. కాంగ్రెస్కు నాయకులు లేరన్నారు. తమ పార్టీలో టికెట్ రాని అభ్యర్ధుల కోసం బీజేపీ ఎదురుచూస్తోందని హరీశ్ రావు దుయ్యబట్టారు.
కాగా.. సోమవారం నాడు అధికార టిఆర్ఎస్ పార్టీ తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసినప్పటి నుంచి మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వార్తల్లోని వ్యక్తిగా నిలిచారు. తనకు, తన కుమారుడికి బిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వాలంటూ ఆయన అడుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం నాడు ఆయన మరొకసారి టికెట్ల కేటాయింపుపై స్పందించారు. నిన్న తాను మాట్లాడింది పార్టీ గురించి కాదని.. తన వ్యక్తిగత అభిప్రాయాలని ఆయన అన్నారు. మంగళవారం నాడు మరోసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంలో బీఆర్ఎస్ టికెట్ల కేటాయింపుపై మరోసారి స్పందించారు.
Also Read: హరీష్ రావుపై నా వ్యాఖ్యలు వ్యక్తిగతం.. పార్టీ గురించి మాట్లాడలేదు.. : మైనంపల్లి
నిన్న తాను పార్టీ గురించి మాట్లాడలేదన్నారు. కేవలం తన వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే వెల్లడించానని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ వెళ్లిన తర్వాతే తన కార్యాచరణను వెల్లడిస్తానని మైనంపల్లి హనుమంతరావు తేల్చారు. హరీష్ రావుపై నా వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగతం. ఇప్పటివరకు ఏ పార్టీనీ సంప్రదించలేదు. నేను క్యాడర్ ను కాపాడుకోవడానికి ఏదైనా చేస్తా.. ముఖ్యమంత్రి నన్నేం అనలేదు. నేనెందుకు పార్టీని అంటాను అన్నారు.