కట్నం కోసం కట్టుకున్నవాడి కర్కశత్వం... హైదరాబాద్ లో వివాహిత ఆత్మహత్య

Published : Jul 31, 2022, 10:34 AM IST
కట్నం కోసం కట్టుకున్నవాడి కర్కశత్వం... హైదరాబాద్ లో వివాహిత ఆత్మహత్య

సారాంశం

అత్తామామల ఆస్తిపై కన్నేసిన ఓ అల్లుడు అదనపు కట్నం కోసం భార్యను వేధించి చివరకు ఆమె ప్రాణాలు తీసుకునేలా చేసాడు. ఈ దారుణం హైదరాబాద్ లో వెలుగుచూసింది. 

హైదరాబాద్ : కట్టుకున్న భార్య కంటే ఆమెవల్ల వచ్చే ఆస్తి అంటేనే అతనికి ప్రేమెక్కువ. అత్తామామల ఆస్తిపై కన్నేసిన అల్లుడు భార్యకు నరకం చూపించి చివరకు ఆమె ప్రాణాలను బలితీసుకున్నాడు. కట్టుకున్న భర్తతో పాటు అత్తింటివారి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

పోలీసులు, బాధిత కుటుంబం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నల్గొండ జిల్లాకు చెందిన నాగలక్ష్మి (30)కి అదే జిల్లా దేవరకొండ కు చెందిన శ్రీకాంత్ తో ఏడేళ్లక్రితం వివాహమయ్యింది. తల్లిదండ్రులకు ఒకే కూతురు కావడంతో భారీగా కట్నకానుకలిచ్చి ఘనంగా పెళ్లిచేసారు. అల్లుడికి కట్నంగా నగదుతో పాటు 30తులాల బంగారు పెట్టారు. దంపతులు హైదరాబాద్ సరూర్ నగర్ వెంకటేశ్వర కాలనీలో కొత్తకాపురం పెట్టారు. 

అయితే కొంతకాలం వీరం సంసారం సాఫీగానే సాగింది. కానీ శ్రీకాంత్ కన్ను అత్తామామల ఆస్తిపై పడటంతో నాగలక్ష్మికి కష్టాలు మొదలయ్యాయి. అదనపు కట్నం కోసం కట్టుకున్నవాడు, అత్తింటివారి వేధింపులు మొదలయ్యాయి. నాగలక్ష్మి తల్లిదండ్రులకు నల్గొండలో కోటి రూపాయల విలువచేసే ఇళ్ళు వుంది... అదనపు కట్నం కింద ఆ ఇంటికి తనకు రాసియ్యాలని శ్రీకాంత్ ఒత్తిడి చేస్తున్నాడు. అందుకు అత్తామామ ఒప్పుకోకపోవడంతో వారి కూతురు నాగలక్ష్మిని వేధించేవాడు. ఇలా భర్త నరకం చూపిస్తుండటంతో తట్టుకోలేకపోయిన నాగలక్ష్మి దారుణ నిర్ణయం తీసుకుంది. తన చావుకు భర్త వేధింపులే కారణమంటూ సూసైడ్ లెటర్ రాసిపెట్టి ఆత్మహత్య చేసకుంది. 

Read more  వివాహితకు వేధింపులు.. అమన్‌గల్‌లో బీజేపీ కౌన్సిలర్‌‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

శనివారం ఐదేళ్ల కొడుకును స్కూల్ కి పంపించిన నాగలక్ష్మి భర్త ఇంట్లోంచి బయటకు వెళ్లగానే అఘాయిత్యానికి పాల్పడింది. చున్నీతో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని బలవన్మణానికి పాల్పడింది. శ్రీకాంత్ ఇంటికి వచ్చేసరికి నాగలక్ష్మి ప్రాణాలు కోల్పోయింది. దీంతో అతడు వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నాగలక్ష్మి రాసిన సూసైడ్ లెటర్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. వివాహిత ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సరూర్ నగర్ పోలీసులు తెలిపారు.

అదనపు కట్నం కోసం తమ  కూతురి ప్రాణాలు తీసి మనవడికి తల్లిప్రేమను దూరంచేసినవారిని కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులను కోరుతున్నారు. అల్లుడితో పాటు అతడి కుటుంబసభ్యులను వదిలిపెట్టకూడదని... తమకు న్యాయ జరిగేలా చూడాలని నాగలక్ష్మి తల్లిదండ్రులు కోరుతున్నారు. 

(ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదు. మీకు ఎటువంటి కౌన్సిలింగ్ సహాయం కావాలన్నా ఐకాల్ (9152987821), ఆసరా (09820466726) వంటి సంస్థలను సంప్రదించండి)

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్