
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాదారుల అకౌంట్లలో భారీగా డబ్బులు జమ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. పలువురు హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాదారుల అకౌంట్లలో భారీగా డబ్బులు జమ కావడంతో వారు షాక్ తింటున్నారు. ఒక్కసారిగా బ్యాంక్ అకౌంట్లో కోట్ల రూపాయల డబ్బు చూసి కొందరు కంగారు పడుతుంటే.. మరికొందరు బ్యాంకు అధికారులకు సమాచారమిస్తున్నారు. నిన్న తమిళనాడులో 100 మందికి పైగా కస్టమర్ల ఖాతాల్లో డబ్బులు జమ కాగా.. తాజాగా తెలంగాణలోనూ ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని మంథని పట్టణంలో మొబైల్ షాప్ నిర్వాహకుడు ఇల్లెందుల సాయి హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాలో దాదాపు 5.68 కోట్లు జమ అయ్యాయి.
దీంతో సాయి ఆశ్చర్యపోయాడు. నిన్న రాత్రి 7 గంటల సమయంలో డబ్బులు ఖాతాలో జమ అయి.. సుమారు 5 గంటల వరకు అలాగే ఉన్నాయి. తర్వాత అకౌంట్ నుంచి మళ్ళీ డబ్బులు మాయం అయ్యాయి. దీంతో సాయి నిన్న ఆదివారం బ్యాంకు సెలవు దినం కావడంతో అధికారులు అందుబాటులో లేరని సాయి తెలిపారు. ఈ రోజు ఉదయం బ్యాంకు అధికారులను సంప్రదించగా.. సాంకేతిక సమస్య కారణంగా అలా జరిగి ఉండొచ్చని బ్యాంకు అధికారులు చెబుతున్నారని సాయి చెప్పారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో తీవ్ర సంచలనంగా మారింది.
ఇదిలా ఉంటే.. వికారాబాద్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. వ్యాపారి వెంకట్ రెడ్డి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అకౌంట్లో రూ. 18.52 కోట్లు జమ అయ్యాయి. దీంతో వెంకట్ రెడ్డి బ్యాంక్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో హెచ్డీఎఫ్సీ బ్యాంకు అధికారులు అప్రమత్తమయ్యారు. సాంకేతిక సమస్యతోనే ఇలా జరిగిందని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. డబ్బు జమ అయిన ఖాతాలను అధికారులు ఫ్రీజ్ చేశారు. కొత్త సాఫ్ట్వేర్ వేసే క్రమంలో ఇలా జరిగిందని అధికారులు తెలిపారు.
చెన్నైలో 100కు పైగా బ్యాంకు ఖాతాదారుల అకౌంట్లలో.. చెన్నైలో ఓ వందమంది హెచ్డీఎఫ్సీ బ్యాంకు(HDFC Bank) వినియోగదారులకు ఖాతాల్లో భారీగా డబ్బులు జమయ్యాయి. ఏకంగా వారి ఖాతాలకు రూ. 13 కోట్ల చొప్పున డబ్బు డిపాజిట్ అయ్యింది. వీరితో పాటు మరి కొందరికి రూ. లక్షల నగదు వచ్చి చేరింది. ఈ సమాచారం వారికి ఎస్ ఎంఎస్ రూపంలో అందటంతో కొందరు బ్యాంకులకు పరుగులు తీశారు. ఎంటీఎంల్లో క్యూలు కట్టారు. తమ తప్పిదం అని గ్రహించిన బ్యాంకు అధికారులు.. వెంటనే అప్రమత్తమయ్యారు. సరిదిద్దు బాటు చర్యలు చేపట్టారు. ఆ నగదును వెనక్కి తీసుకున్నారు.సాప్ట్ వేర్ లోపం ఇలా జరిగినట్టు తెలిపారు. ఇక, ఈ 100 మందే కాకుండా మరి కొంత మంది(HDFC Bank) ఖాతాలకు రూ.10,000, రూ.50,000, రూ.లక్ష నగదు డిపాజిట్ అయ్యినట్టు అధికారులు గుర్తించారు.
శనివారం సాధారణ నిర్వహణ పనులు చేపట్టడంతో ఈ సమస్య తలెత్తిందని బ్యాంకు అధికారులు తెలిపారు. ‘‘మేము సమస్యను గుర్తించాము. ఈ ఖాతాల డెబిట్ సేవలను బ్లాక్ చేసాము. ఈ సమస్య దేశవ్యాప్తంగా చోటుచేసుకుంది. 80 శాతానికి పైగా పరిష్కరించబడింది. ఈ సమస్య చెన్నైలోని దాదాపు 10 శాతం బ్యాంక్ శాఖలలో నివేదించబడింది’’ అని బ్యాంకు అధికారులు చెప్పారు.