మాణిక్య సోమయాజులు పల్లకీ మోసిన బీజేపీ నేత రాంమాధవ్

By ramya neerukondaFirst Published Nov 13, 2018, 10:38 AM IST
Highlights

విద్వదాహితాగ్ని బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్యసోమయాజులకి దర్శనమ్ జీవన సాఫల్య పురస్కారం అందించారు. 

విద్వదాహితాగ్ని బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్యసోమయాజులకి దర్శనమ్ జీవన సాఫల్య పురస్కారం అందించారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం రవీంద్రభారతిలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాంమాధవ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. కేవీ రమణాచారి తదితరులు.. సోమయాజులని పల్లకిలో కూర్చోపెట్టి ఊరేగించారు. వీరే స్వయంగా ఆయన పల్లకీని మోయడం విశేషం. అనంతరం అతిరథ మహారథుల సమక్షంలో దర్శనమ్ జీవన సాఫల్య పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.

మాణిక్య సోమయాజులకి " ధార్మిక వరేణ్య " అనే బిరుదు ప్రదానం చేశారు.  గండపెండేరం, రజత కిరీటం, పట్టు వస్త్రాలతో ఆయనను ఘనంగా సత్కరించారు. అంతకుముందు రవీంద్రభారతి వేదికపై స్ఫటిక లింగానికి రుద్రాభిషేకం నిర్వహించారు. సత్కారం అనంతరం కన్నులపండువగా పుష్పాభిషేకం జరిగింది.

 ఈ కార్యక్రమంలో జస్టిస్ నూతిరామ్మోహనరావు , తిరుపతి వేదవిశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి. మురళీధర శర్మ, ఆధ్యాత్మిక ధార్మిక వేత్తలు పురాణం మహేశ్వర శర్మ , మంగళంపల్లి వేణుగోపాలశర్మ, దోర్బల ప్రభాకర శర్మ,ప్రభుత్వ పాఠ్యపుస్తక ముద్రణాలయం సంచాలకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ, శాస్త్రుల రఘురామా శర్మ, శతావధాని డా.జీ.ఎం. రామ శర్మ, డా.అయాచితం నటేశ్వర శర్మ, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త వీఎస్ ఆర్ మూర్తి , తెలంగాణ విద్వత్సభ అధ్యక్షులు యాయవరం చంద్రశేఖర శర్మ, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, మాడుగులశశిభూషణ శర్మ సోమయాజి తదితరులు పాల్గొన్నారు.

 పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ వ్రతధర రామానుజ జీయరు స్వామి,శ్రీశ్రీశ్రీ మధుసూదనానంద సరస్వతీ స్వామి, శ్రీశ్రీశ్రీ విద్యా గణేశనంద భారతీ స్వామి ,గాయత్రి తత్త్వానంద ఋషి గారలు అనుగ్రహ భాషణం చేశారు

click me!