ఆటో‌లో దొరికిన బంగారు గొలుసు పోలీసులకు అప్పగింత: అంతలోనే విషాదం

By narsimha lodeFirst Published Mar 23, 2024, 8:13 AM IST
Highlights


ఆటోలో దొరికిన బంగారు గొలుసును హైద్రాబాద్  పోలీసులకు అప్పగించాడు ఓ వ్యక్తి.  అయితే అంతలోనే విషాదం చోటు చేసుకుంది.

హైదరాబాద్:  ఆటోలో  దొరికిన బంగారు గొలుసును  పోలీసులకు అప్పగించిన కొద్దిసేపటికే ఓ వ్యాపారి  మృతి చెందాడు. ఈ ఘటన హైద్రాబాద్  లో చోటు చేసుకుంది.హైద్రాబాద్ చెందిన  ఓ మహిళ  శుక్రవారంనాడు నల్లకుంట నుండి  హైకోర్టుకు  ఆటోలో వెళ్లారు.  అయితే  ఆ మహిళ మెడలోని బంగారు గొలుసు ఆటోలో పడిపోయింది. అయితే  ఆమె  ఆ విషయాన్ని గమనించలేదు. అయితే  ఆటో దిగిన తర్వాత ఆ విషయాన్ని ఆమె గుర్తించింది.  వెంటనే తన భర్తకు ఆమె ఈ విషయాన్ని చెప్పారు.

ఇదిలా ఉంటే  మహిళ ఆ ఆటో దిగి వెళ్లిన తర్వాత   గోవిందరామ్ సోని అనే వ్యక్తి ఇదే ఆటోను బుక్ చేసుకున్నాడు. అయితే ఆటోలో  బంగారు గొలుసును గోవిందరామ్ గుర్తించాడు.  వెంటనే ఆటో డ్రైవర్ కు విషయం చెప్పాడు. అయితే ఇంతకుముందు ఆటోలో ప్రయాణించిన  మహిళకు చెందిన గొలుసుగా   డ్రైవర్ అనుమానించాడు. వెంటనే  గోవింద్ రామ్  షాహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి బంగారు గొలుసును పోలీసులకు అప్పగించారు.  బంగారు గొలుసును  అప్పగించిన గోవింద్ రామ్ ను పోలీసులు అభినందించారు. అయితే అదే సమయంలో  గోవింద్ రామ్  అస్వస్థతకు గురయ్యారు.  తనకు కళ్లు తిరుగుతున్నాయని  పోలీసులకు చెప్పాడు.  వెంటనే పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే  అప్పటికే  అతను మృతి చెందినట్టుగా  వైద్యులు ధృవీకరించారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి శుక్రవారం నాడు మీడియాకు వివరించారు.  ఆటోలో తనకు లభ్యమైన  బంగారు గొలుసును  అప్పగించిన  కొద్దిసేపటికే గోవింద్ రామ్ కు  గుండెపోటు వచ్చిందని , వెంటనే ఆసుపత్రికి తరలించగా అతను మృతి చెందినట్టుగా  వైద్యులు చెప్పారని ఆయన వివరించారు.

click me!