
హైదరాబాద్ శివారులో దారుణం జరిగింది. భార్యను కిరాతకంగా నరికిన ఓ వ్యక్తి, తన 3 నెలల కుమారుడిని నీటి సంపులో వేసి చంపాడు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండరావిరాలకు చెందిన లావణ్యకు అనాజ్పూర్కు చెందిన ధనరాజ్తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఆద్య అనే మూడేళ్ల కుమార్తె వుండగా, ఇటీవలే లావణ్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే బాలింతగా వున్న లావణ్యను బుధవారం మధ్యాహ్నం తన పుట్టింటి నుంచి తీసుకొచ్చాడు ధనరాజ్. అయితే ఏం జరిగిందో ఏమో కానీ భార్యాభర్తల మధ్య గొడవ జరగ్గా.. క్షణికావేశంలో లావణ్యను ధనరాజ్ గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు.
అక్కడితో ఆగకుండా పసిగుడ్డు అన్న కనికరం కూడా లేకుండా తన మూడు నెలల కొడుకుని నీటి సంపులో వేసి హతమార్చాడు. అయితే వీరిద్దరి గొడవను చూసి భయపడిన ఆద్య ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీసింది. లేదంటే ధనరాజ్ పాపను కూడా చంపేసేవాడే. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కుటుంబ కలహాలతోనే ధనరాజ్ ఈ హత్యలకు పాల్పడినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చిన పోలీసులు .. పరారీలో వున్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.