
హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కళను సాకారం ఘనత కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీకి దక్కుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కచెప్పారు. హైదరాబాద్ సరూర్నగర్లో టీపీసీసీ ఈరోజు యువ సంఘర్షణ సభను నిర్వహించింది. ఈ సభకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభ వేదికపై నుంచి సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణలో ఉద్యోగాల లేక యువత నిరాశలో ఉందని చెప్పారు. నీళ్లు, నిధులు, నియమాకాలు కోసం పోరాడి తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలకు పాల్పడితే.. బిడ్డలు మరణించకూడదని తల్లిలాగా ఆలోచన చేసి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని చెప్పారు.
ఏ యువత కోసం కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందో.. నేడు ఉద్యోగాల లేక వారంతా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తెలంగాణ యువతకు భరోసా ఇవ్వడానికి ప్రియాంగ గాంధీ రాష్ట్రానికి వచ్చారని చెప్పారు. నిరుద్యోగ సమస్యకు భరోసా కోసం రాష్ట్రం నలుమూలల నుంచి యువత ఇక్కడకు వచ్చారని అన్నారు. ఆదిలాబాద్ నుంచి సరూర్నగర్ వరకు పాదయాత్ర చేశానని చెప్పారు. తన పాదయాత్రలో అనేక సమస్యలను చూశానని తెలిపారు.
తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఫలాలు కొందరు ప్రభుత్వ పెద్దలకే అందుతున్నాయని విమర్శించారు. ఇందుకోసమేనా తెలంగాణ తెచ్చుకుందని ప్రశ్నించారు. విద్యార్థి లోకం, నిరుద్యోగ యువత ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. మరోకసారి పోరాటానికి సిద్దం అవుదామని పిలుపునిచ్చారు. ఆశలు, ఆశయాలను గుర్తించిన కాంగ్రెస్తో చేతులు కలిపి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందామని కోరారు. ఇక, తన ప్రసంగం ముగిసిన తర్వాత పోచంపల్లి చేనేత కార్మికులు అందజేసిన చీరను ప్రియాంక గాంధీకి మల్లు భట్టివిక్రమార్క బహుకరించారు.