
తెలంగాణ వేగంగా ఎదుగుతున్న రాష్ట్రమని.. చేయూత అందించాలని చాలా సందర్బంలో కేంద్రాన్ని కోరడం జరిగిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటివరకు కేంద్రం నుంచి అందిన సాయం సున్న అని విమర్శించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన కేటీఆర్.. ఈరోజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమయ్యారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ది చెందుతున్న నగరమని చెప్పారు. వ్యాక్సిన్ ప్రొడక్షన్కు తెలంగాణ గ్లోబల్ హబ్గా మారిందని అన్నారు.
హైదరాబాద్లో వరదలకు కూడా కేంద్రం సాయం అందించలేదని చెప్పారు. హైదరాబాద్లో రక్షణ శాఖ భూములున్న చోట అభివృద్ది పనులకు ఆటంకం కలుగుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించి ఎన్డీయే ప్రభుత్వంలో ఇప్పటివరకు పనిచేసిన ఐదుగురు రక్షణ శాఖ మంత్రులను పలుసార్లు కలవడం జరిగిందని చెప్పారు. ఈరోజు మరోసారి రాజ్సింగ్ను కలిసి తమ డిమాండ్లను వినిపించడం జరిగిందని చెప్పారు. ప్రధానంగా నాలుగు రిక్వెస్ట్లు ఇచ్చామని తెలిపారు.
‘‘హైదరాబాద్ జూబ్లీ బస్టాండ్ నుంచి రాజీవ్ రహదారి(ఉత్తర తెలంగాణ వైపు) వెళ్లే మార్గంలో స్కై వేల నిర్మాణానికి 96 ఎకరాల రక్షణ శాఖ భూమిని కోరాం. దానికి సమానమైన భూమిని ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే.. ప్యాటీ నుంచి నాగ్పూర్ హైవేకు 18.5 కి.మీ మే స్కై వే నిర్మించేందుకు 56 ఎకరాల స్థలం ఇవ్వాలని కోరాం. భూమికి భూమి ఇస్తామని చెప్పడం జరిగింది. ఉప్పల్లో స్కై వాక్ కట్టడం జరిగింది.. దానిని సోమవారం ప్రారంభించనున్నాం. మొహిదీపట్నం రైతుల బజార్ వద్ద కూడా అలాంటి స్కై వాక్ నిర్మించాలని భావిస్తున్నాం.. అక్కడ కూడా రక్షణ శాఖ భూములు ఉన్నాయి.. అందులో అర ఎకరం ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది.
హైదరాబాద్ నగరంలో 142 లింక్ రోడ్డులను ప్లాన్ చేశాం.. అందులో రెండు, మూడు కారిడార్లలో రక్షణ శాఖకు చెందిన భూములు అడ్డం వస్తున్నాయి.. వాటిని కూడా ఇవ్వమని కోరడం జరిగింది. అలాగే.. కంటోన్మెంట్ ఏరియాలో ఉండే లీజ్ భూములను జీహెచ్ఎంసీకి బదలాయిస్తే.. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టేందుకు ఉపకరిస్తాయని చెప్పడం జరిగిందని అన్నారు. వారు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం’’ అని కేటీఆర్ చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సాయం అందిస్తే సంతోషమని చెప్పారు. లేకపోతే ప్రజా క్షేత్రంలో వారి తీరును ఎండగడతామని అన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు కూడా కేంద్రానికి ప్రతిపాదనలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. వాటి గురించి పరిశీలించాలని రేపు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసి కోరనున్నట్టుగా కేటీఆర్ తెలిపారు.
ఉత్తరప్రదేశ్లో పది మెట్రోలకు సాయం అందించి.. తెలంగాణలోని హైదరాబాద్కు మాత్రం సాయం అందించడం లేదని కేంద్రంపై మండిపడ్డారు. గుజరాత్లో వరదలు వస్తే సాయం చేస్తారని.. హైదరాబాద్కు మాత్రం ఇప్పటివరకు సాయం అందించలేదని విమర్శించారు. తెలంగాణ రూపాయి కడితే.. వెనక్కి వచ్చేది 46 పైసలు మాత్రమేనని అన్నారు. దేశంలో వెనకబడిన ప్రాంతాలకు తెలంగాణ సొమ్ము వెళ్తున్నందుకు.. ఇక్కడి ప్రజలకు సెల్యూట్ చేయాలని అన్నారు.