15న అధికారులతో భేటీ: ఆర్టీసీ బస్సుల రాకపోకలపై కేసీఆర్ సర్కార్ తేల్చేనా

By narsimha lodeFirst Published May 11, 2020, 1:01 PM IST
Highlights

రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల రాకపోకలపై తెలంగాణ సర్కార్ ఈ నెల 15వ తేదీన అధికారులతో నిర్వహించే సమావేశంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 22వ తేదీ నుండి ఆర్టీసీ బస్సులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. 
 

హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల రాకపోకలపై తెలంగాణ సర్కార్ ఈ నెల 15వ తేదీన అధికారులతో నిర్వహించే సమావేశంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 22వ తేదీ నుండి ఆర్టీసీ బస్సులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. 

కరోనా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో బస్సులు రాకపోకలను ప్రభుత్వం నిలిపివేసింది. అయితే ప్రజా రవాణాపై ఇప్పటికిప్పుడే ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేమని తేల్చి చెప్పింది. లాక్ డౌన్ పై గ్రీన్,ఆరెంజ్ జోన్లలో ఆంక్షలను ఎత్తివేసిన నేపథ్యంలో రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలపై సీఎం కేసీఆర్ అధికారులతో ఈ నెల 15వ తేదీన సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను సీఎం కేసీఆర్ అధ్యయనం చేయనున్నారు. ఆయా రాష్ట్రాలు, జిల్లాల పరిస్థితులను అధ్యయనం చేసిన మీదట ఆర్టీసీ బస్సుల రాకపోకలపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

ఆర్టీసీలో పనిచేసే సిబ్బంది బస్సులను సిద్దం చేస్తున్నారు. ఎప్పుడు ప్రభుత్వం ఆదేశాలిచ్చినా ఆర్టీసీ బస్సులు రోడ్డుపైకి వచ్చేలా సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. దెబ్బతిన్న బస్సులను మెకానిక్ సిబ్బంది రిపేర్లు చేస్తున్నారు.

రెండు రోజులకు ఒక్కసారైనా బస్సులను స్టార్ట్ చేసి ముందుకు వెనక్కు నడుపుతున్నారు. బస్సులోని ఇంజన్ భాగాల పనితీరు ఎలా ఉందనే విషయాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నారు.

also read:సిర్పూర్ పేపర్ మిల్లులో గ్యాస్ లీక్: భయాందోళనలో కార్మికులు

ఒకవేళ బస్సులను తిప్పాలని అధికారులు నిర్ణయిస్తే  ప్రతి బస్సులో సగం సీట్లలోనే ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేర్చనున్నారు. భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులను తప్పనిసరి చేయనున్నారు.

మాస్కులు లేకపోతే బస్సుల్లోకి ప్రయాణీకులను అనుమతించే అవకాశాలు లేకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. డిపో నుండి బస్సు బయలుదేరే ముందు బస్సును రసాయనాలతో శుభ్రం చేయనున్నారు.

50 శాతం ఆక్యుపెన్సీ తో బస్సులను నడపాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం.  రాష్ట్రంలో దూర ప్రాంతాలకు మాత్రమే బస్సులను నడపాలని  ఆర్టీసీ యోచిస్తోందని తెలుస్తోంది. 40 మందితో ప్రయాణం చేసే బస్సులో కేవలం 20 మంది తోనే నడిపేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.  

టికెట్లు బస్సులో కాకుండా రిజర్వేషన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 50శాతం ఆక్యుపెన్సీ తో బస్సులు నడిస్తే చార్జీలు కూడా డబుల్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.బస్సులు తిరిగే విషయం పై ఈ నెల 15 వ తేదీన ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

click me!