మద్యం మత్తులో యువకుడి దుర్మరణం...కోరుట్ల బంద్ కు కాంగ్రెస్ పిలుపు

By Arun Kumar PFirst Published May 11, 2020, 12:07 PM IST
Highlights

మద్యం మత్తులో నానా హంగామా సృష్టించి చివరకు ఓ యువకుడు మృత్యువాత పడిన విషాద సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. 

జగిత్యాల: మద్యం మత్తులో ఓ యువకుడు నానా హంగామా సృష్టించి చివరకు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన ఆదివారం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో చోటుచేసుకుంది. అయితే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే యువకుడు మృతిచెందాడని... కరోనా విజృంభణ కొనసాగుతున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం మద్యం విక్రయాలను ప్రారంభించడం వల్ల ఇలాంటి దారుణాలు చోటుచేసుకుంటున్నాయని ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. యువకుడి మృతికి నిరసనగా ఇవాళ కోరుట్ల బంద్ కు పిలుపునిచ్చారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే  కొమిరెడ్డి రాములు. 

 జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని నంది చౌరస్తాలో నడిరోడ్డుపై ఆదివారం ఓ యువకుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. రోడ్డుపై వెళుతున్న వారితో అనవసరంగా గొడవ దిగడం, అటుగా వెళ్తున్న మహిళపై చేయి చేసుకునే ప్రయత్నం చేయడం, రోడ్డుకు అడ్డంగా రాళ్లను వేయడం వంటి చిత్రవిచిత్ర చర్యలకు పాల్పడుతూ అందరినీ భయబ్రాంతులకు గురిచేశాడు.   

చివరకు రోడ్డు పక్కనే వున్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ముట్టుకుని షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. మద్యం మత్తులో విచిత్ర చేష్టలతో భయాందోళనలకు గురిచేసిన ఆ యువకుడు ట్రాన్స్ ఫార్మర్ ను పట్టుకున్న సమయంలో చాలామంది చూస్తున్నా కాపాడేందుకు సాహసించలేకపోయారు. మద్యంమత్తులో మతిస్థిమితాన్ని కోల్పోయినవాడిలా ప్రవర్తించిన ఆ యువకుడు మరణించడం స్థానికులను కలచివేసింది. 

ఈ ఘటనలో మృతి చెందిన యువకుడి వివరాలు తెలియరాలేదని పోలీసులు చెబుతున్నారు. అతని వద్ద ఐడీ ప్రూఫ్ కూడా లేదని, ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీ కావొచ్చని అనుమానిస్తున్నారు. మృతుడి వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

click me!