Free Bus: హాస్టల్ వెళ్లడం ఇష్టంలేక 33 గంటలు బస్సుల్లోనే ప్రయాణించిన బాలిక.. చివరికి జేబీఎస్‌లో..

By Mahesh KFirst Published Dec 29, 2023, 11:03 PM IST
Highlights

మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ఆ 12 ఏళ్ల బాలిక తన ఇష్టానికి వాడుకుంది. హాస్టల్ నుంచి తప్పించుకోవడానికి ఆమె 33 గంటలపాటు బస్సుల్లో పలు చోట్లకు తిరిగింది. చివరికి పోలీసులకు జేబీఎస్‌లో చిక్కింది.
 

Karimnagar: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులో ఉన్నది. చాలా మంది తమ అవసరాలకు ఉపయోగిస్తుండగా.. 12 ఏళ్ల ఓ బాలిక మాత్రం ఈ సదుపాయాన్ని తన ఇష్టానికి వాడుకుంది. హాస్టల్ వెళ్లడం ఇష్టం లేక బంధువుల ఇంటి నుంచి తల్లిదండ్రుల వద్దకు వెళ్లకుండా బస్సుల్లోనే ప్రయాణం చేస్తూ గడిపింది. 33 గంటలు వివిధ బస్సుల్లో వివిధ చోట్లకు వెళ్లి వచ్చింది. తల్లిదండ్రులు హైరానా పడి పోలీసులను ఆశ్రయించారు. అయితే.. ఆమె చివరకు జూబ్లిహిల్స్ బస్ స్టేషన్‌లో మధ్యాహ్నం 1 గంటలకు ఓ బస్సులో నుంచి దిగుతుండగా పోలీసులకు చిక్కింది. ఆమెకు మెడికల్ టెస్టులు చేసి తల్లిదండ్రులకు అప్పగించారు.

మానకొండూరు మండలం ఉటూరు గ్రామానికి చెందిన కనుకుంట్ల నర్సింహం (ఎక్స్ సర్వీస్‌మన్) కుటుంబం కరీంనగర్‌లో ఉంటున్నారు. ఆయనకు ఎనిమిదో తరగతి చదివే కూతురు ఉన్నది. ఆమెను హాస్టల్‌లో చదివిస్తున్నాడు. క్రిస్మస్ సెలవుల కోసం ఆమెను పెద్దపల్లిలో ఉండే తాత, అవ్వల వద్దకు పంపాడు. బుధవారం ఆమె తిరిగి హాస్టల్ వెళ్లిపోవాలి. ఇది తండ్రి ఆజ్ఞ. కానీ, ఆ బాలికకు హాస్టల్ వెళ్లాలని లేదు.

తాత వాళ్లు పెద్దపల్లిలో బస్టాండ్ వద్దకు వచ్చి బాలికను బస్సు ఎక్కించి ఆ బస్సు వివరాలను తండ్రి నర్సింహులుకు పంపించారు. బిడ్డ కోసం ఆయన మంచిర్యాల చౌరస్తా వద్ద వెయిట్ చేస్తున్నాడు. అయితే, బిడ్డ మాత్రం మంచిర్యాల చౌరస్తా రాకముందే ఉండే బొమ్మకల్ ఎక్స్‌రోడ్ వద్దే దిగిపోయింది. అక్కడి నుంచి ఆటో ఎక్కి కరీంనగర్ బస్ స్టాండ్‌కు వెళ్లిపోయింది. అక్కడి నుంచి హైదరాబాద్ బస్ ఎక్కేసింది.

Also Read: Hyderabad: ఇకపై డ్రగ్ టెస్టులు కూడా.. టెస్టు కిట్‌లతో పోలీసులు.. ఈ కిట్‌లు ఎలా పని చేస్తాయి?

తండ్రి మాత్రం బిడ్డ వచ్చే బస్సు కోసం వెయిట్ చేశాడు. బస్సు వచ్చింది.. కానీ, బిడ్డ దిగలేదు. దీంతో కండక్టర్‌ను అడిగాడు. ఆమె బొమ్మకల్ స్టాప్ వద్దే దిగిపోయిందని సమాధానం చెప్పారు. దీంతో  ఆయన పరుగున బొమ్మకల్ స్టాప్ వద్దకు వెళ్లాడు. కానీ, బిడ్డ కనిపించలేదు. దీంతో వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు వెంటనే బస్ స్టాండ్‌లు, ఇతరచోట్ల ఏర్పాటు చేసిన సీసీటీవీల ఫుటేజీలను పరిశీలించడం ప్రారంభించారు. ఆమె ఫొటోను సోషల్ మీడియాలో సర్క్యులేట్ కూడా చేశారు.

ఆ ఫొటో సోషల్ మీడియాలో చూసి గంగాధరకు చెందిన అభిలాష్ అనే వ్యక్తి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆమె తనతో హైదరాబాద్ నుంచి గంగాధరకు బస్సులో వచ్చిందని, ఎక్కడికెళ్లుతున్నావని అడగ్గా.. జగిత్యాలకు వెళ్లుతున్నట్టు చెప్పిందని పోలీసులకు తెలిపారు. ఆమె బస్సుల్లో ఒక చోట నుంచి మరో చోటకు తిరుగుతున్నదని పోలీసులకు అర్థమైంది. దీంతో వెంటనే జగిత్యాల, కోరుట్ల, జేబీఎస్ బస్ స్టాండ్‌లకు పోలీసు టీమ్‌లను పంపించారు.

Also Read: Miracle: 40 నిమిషాలు మరణించి లేచింది.. చావు అనుభవాలను ఇలా చెప్పింది..!

హైదరాబాద్‌కు వెళ్లిన టీమ్ ఆ బాలికను పట్టుకుంది. నిజామాబాద్ బస్ నుంచి శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు దిగుతుండగా పోలీసులు చూశారు. ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమెకు హెల్త్ చెకప్ చేసి కుటుంబానికి అప్పగించారు.

click me!