ఉపాధ్యాయ సంఘాలపై కడియం మండిపాటు

First Published Jun 25, 2018, 6:34 PM IST
Highlights

ఉపాధ్యాయుల బదిలీలకు ప్రవేశపెట్టిన వెబ్ కౌన్సెలింగ్ విషయంలో ఉపాధ్యాయ సంఘాల తీరుపై తెలంగాణ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి మండిపడ్డారు.

హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీలకు ప్రవేశపెట్టిన వెబ్ కౌన్సెలింగ్ విషయంలో ఉపాధ్యాయ సంఘాల తీరుపై తెలంగాణ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి మండిపడ్డారు. వెబ్‌కౌన్సెలింగ్‌ను తొలుత అంగీకరించిన ఉపాధ్యాయ సంఘాలు ఇప్పుడు వద్దంటున్నాయని ఆయన అన్నారు. 

వెబ్ కౌన్సెలింగ్ వద్దంటూ తనకు మెసేజ్ లు పెడుతున్నారని, ఫోన్లు చేస్తున్నారని ఆయన సోమవారం మీడియా సమావేశంలో చెప్పారు. వెబ్ కౌన్సెలింగ్ ఉండాలని కొంతమంది టీచర్లు చెబుతున్నారని అన్నారు. . తమ పెత్తనం పోతుందన్న ఉద్దేశంతోనే కొంతమంది తప్పుడు ప్రచారానికి తెరలేపారని కడియం శ్రీహరి ఆయన విమర్శించారు.

సాంకేతికపరమైన ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తేవాలని, ప్రక్రియలో ఎవరికైనా అన్యాయం జరిగితే తప్పకుండా సరిచేస్తామని అన్నారు. తప్పుడు ధృవపత్రాలు ఇచ్చేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

ఉపాధ్యాయుల బదిలీలు కోసం చేపట్టిన వెబ్ కౌన్సెలింగ్‌పై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఉపాధ్యాయులు తప్పుడు ప్రచారం నమ్మవద్దన ఆయన అన్నారు. వేల మంది ఉపాధ్యాయుల తాకిడితో సర్వర్ డౌన్ అయిందని ఆయన వివరణ ఇచ్చారు.

ఉపాధ్యాయ బదిలీల కోసం వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా ప్రక్రియ చేపట్టామని తెలిపారు. బదిలీల కోసం 75,318 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారని, ఖాళీలు, సీనియారిటీ జాబితాలు కూడా ప్రకటించామని చెప్పారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకే షెడ్యూల్ సవరణ చేశామని స్పష్టం చేశారు.

 వివిధ అంశాల ఆధారంగా కొంత మంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారని చెప్పారు. ఈ నెల 26న వచ్చే న్యాయస్థానం తీర్పుకు అనుగుణంగా తదుపరి ప్రక్రియ చేపడుతామని కడియం శ్రీహరి పేర్కొన్నారు. 

2,193 మందిలో 2,181 మంది ప్రధానోపాధ్యాయులు ఐచ్ఛికాలు నమోదు చేసుకున్నారని చెప్పారు. 31,960 మంది స్కూల్ అసిస్టెంట్లు బదిలీ దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. స్కూల్ అసిస్టెంట్ల ఐచ్ఛికాల నమోదుకు రేపటి వరకు అవకాశం ఉందని చెప్పారు. ఎస్జీటీలకు కూడా ఒక రోజు అవకాశాన్ని పొడిగిస్తామని చెప్పారు. 

click me!