ఉత్తమ్పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
హైదరాబాద్: ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్దంగా ఉన్నామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. గతంలో కూడ ఇదే రకంగా ప్రకటించారని ఆయన గుర్తు చేశారు.
సోమవారం నాడు ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై విమర్శలను ఎక్కుపెట్టారు.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ వంద సీట్లకు పైగా విజయం సాధిస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. గతంలో కూడ జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇతర విపక్షాలు ఏ రకమైన ఫలితాలు వచ్చాయో తెలుసునని ఆయన గుర్తు చేశారు.
ముందస్తు ఎన్నికలకు తాము కూడ సిద్దంగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ప్రకటన మేకపోతు గాంభీర్యమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో ఎన్నడూలేని విధంగా ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పాలన చేస్తున్నందునే ప్రజలు తమ వైపు నిలుస్తున్నారని ఆయన చెప్పారు.
తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిపేలా పాలన సాగిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే తాను గడ్డం తీయనని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ గడ్డం పెంచుకొన్నవాళ్ళంతా గబ్బర్ సింగ్లు కాదన్నారు.