తలకు హెల్మెట్ తోనే విధులు... ఉస్మానియా హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ల వినూత్న నిరసన

By Arun Kumar PFirst Published Oct 27, 2021, 11:52 AM IST
Highlights

ఉస్మానియా హాస్పిటల్లో పనిచేసే జూనియర్ డాక్టర్లు వినూత్న నిరసనకు దిగారు. రోగుల ప్రాణాలను కాపాడే తమకే రక్షణ లేకుండా పోయిందంటూ తలకు హెల్మెట్ ధరించి విధులకు హాజరయ్యారు. 

అప్జల్ గంజ్: తెలంగాణ ప్రజలకు దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఉస్మానియా హాస్పిటల్ శిథిలావస్థకు చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో ఎంతోమంది ప్రాణాలను కాపాడిన ఇదే హాస్పిటల్ ఇప్పుడు ప్రమాదాలకు కారణమవుతోంది. తాజాగా ఈ హాస్పిటల్ లో విధులు నిర్వర్తిస్తుండగా ఓ డాక్టర్ తలపై సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. దీంతో రోగులకే కాదు తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందంటూ జూనియర్ డాక్టర్లు వినూత్న నిరసన చేపట్టారు. 

హైదరాబాద్ అప్జల్ గంజ్ లోని osmania general hospital లో భువనశ్రీ వైద్యురాలిగా పనిచేస్తున్నారు. రోజూ మాదిరిగానే గత సోమవారం కూడా ఆమె విధులకు హాజరయ్యారు. అయితే డెర్మటాలజీ విభాగంలో పేషెంట్స్ కు వైద్యసేవలు అందిస్తుండగా ఒక్కసారిగా సీలింగ్ ఫ్యాన్ ఊడి ఆమెపై పడింది. దీంతో డాక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. 

ఈ ఘటన ఉస్మానియా హాస్పిటల్ లో పనిచేసే డాక్టర్లలో కలవరానికి కారణమయ్యింది. రోగుల ప్రాణాలకు కాపాడే తమకే రక్షణ లేకుండా పోయిందంటూ మంగళవారం నుండి జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగారు. నిన్న ఔట్ పేషెంట్ బ్లాక్ లో మౌనంగా వుంటూ నిరసన తెలియజేసారు జూడాలు. 

read more  కేసీఆర్ ఓ సారి ఉస్మానియాకు రా.. ఎమ్మెల్యే రాజాసింగ్  

అయితే నేడు(బుధవారం) మరింత వినూత్నంగా నిరసనకు దిగారు జూనియర్ డాక్టర్లు. ద్విచక్రవాహనదారులు ఉపయోగించే హెల్మెట్లను తలకు ధరించి విధులకు హాజరయ్యారు. సీలింగ్ ఫ్యాన్ ఊడిపడి తోటి డాక్టర్ గాయపడిన తర్వాత ఆస్పత్రిలో ఎక్కడ ఏ ప్రమాదం పొంచివుందో అన్నభయం వెంటాడుతోందని... విధులు నిర్వర్తించాలంటే భయంగా ఉందని అన్నారు. కాలంచెల్లిన పాత భవనాల్లో విధులు నిర్వహిస్తున్న తమ ప్రాణాలకు రక్షణ లేదంటూ జూడాలు ఆవేదన వ్యక్తం చేసారు.

వైద్య సిబ్బందితో పాటు పేషెంట్స్ రక్షణలో దృష్టిలో వుంచుకుని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. వెంటనే నూతన భవన నిర్మాణ దిశగా చర్యలు తీసుకోవాలని... వీలైనంత తొందరగా తమ రక్షణ విషయంలో చర్యలు తీసుకోవాలని జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు. 

read more  ఒంటిమీద సరైన బట్టలు లేక, గాయాలతో యువతి.. ఔదార్యం చూపించిన డాక్టర్ !!

గతంలో కూడా హైదరాబాద్ లో భారీ వర్షాలు కురవడంతో వరద నీరు ఉస్మానియా హాస్పిటల్ లోకి చేరి ప్రమాదకరంగా మారింది. ఈ సమయంలో కూడా పేషెంట్స్ తో పాటు వైద్యసిబ్బంది రక్షణ విషయంలో ఆందోళన వ్యక్తమయ్యింది. ప్రతిపక్షాలతో పాటు వైద్యశాఖ ఉన్నతాధికారులు కూడా హాస్పిటల్ కు పరిశీలించారు. ఇలా కొన్నిరోజులు హడావుడి సాగినా కథ మళ్ళీ మొదటికే వచ్చింది. అదే శిథిలావస్థ హెరిటేజ్ భవనంలోనే రోగులకు వైద్యం, వైద్యసిబ్బంది విధులు యధావిదిగా మొదలయ్యాయి.  

మళ్లీ ఇప్పుడు డాక్టర్ ప్రమాదానికి గురవడంతో మళ్లీ ఉస్మానియాలో రోగులకు, వైద్యులకు రక్షణ లేదంటూ హడావుడి మొదలయ్యింది. అయితే ఈసారి డాక్టర్లు నిరసనకు దిగారు. ఇప్పుడయినా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకుంటుదేమో చూడాలి. 
 

click me!