
కొద్దిరోజుల క్రితం స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జానకీపురం ఎమ్మెల్యే నవ్యల మధ్య యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. తనను రాజయ్య లైంగికంగా వేధిస్తున్నాడని.. కోరిక తీర్చాలంటూ ఒత్తిడి చేస్తున్నారంటూ నవ్య ఆరోపణలు గుప్పించారు. తనపై వ్యామోహంతోనే సర్పంచ్ టికెట్ ఇప్పించానని రాజయ్య అంటున్నాడని.. పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో రాజయ్య స్వయంగా నవ్య ఇంటికి వెళ్లి రాజీ కుదుర్చుకోవడం, గ్రామాభివృద్ధికి నిధులు కేటాయిస్తానని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.
ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ఇప్పటికే 115 మంది అభ్యర్ధులతో తొలి జాబితా ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీలు అదే పనిలో వున్నారు. ఈ క్రమంలో నవ్య మరోసారి తెరపైకి వచ్చారు. తనకు ఓ ఛాన్స్ ఇవ్వాలని.. ఒక మహిళ ఎమ్మెల్యే అయితే ఆడపడుచులు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ సమస్యలు చెప్పుకోవడానికి వీలు కలుగుతుందని నవ్య చెప్పారు. మాదిగ బిడ్డనైన తనకు స్టేషన్ ఘన్పూర్ నుంచి అవకాశం కల్పించాలని ఆమె కోరారు. కేసీఆర్ ఒక్క ఛాన్స్ ఇస్తే నియోజకవర్గం రూపు రేఖలు మారుస్తానని ఆమె పేర్కొన్నారు.
ALso Read: అంతా కాలమే నిర్ణయిస్తుంది.. పార్టీ మారడంపై ఎమ్మెల్యే రాజయ్య కీలక వ్యాఖ్యలు..
కాగా.. త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు టికెట్ నిరాకరించారు కేసీఆర్. ఆయనకు బదులుగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ఫైనల్ చేశారు. దీంతో రాజయ్య అలకబూనారు. అనుచరులతో మాట్లాడుతూ తనకు అన్యాయం జరిగిందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కడియం శ్రీహరికి టికెట్ కన్ఫర్మ్ కావడంతో ఆయన ప్రచారాన్ని ప్రారంభించారు.
కడియం ఇక్కడి నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. తొలుత టీడీపీలో ఆ తర్వాత బీఆర్ఎస్లో ఆయన చేరారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ కేబినెట్లలో మంత్రిగా పనిచేశారు. తాజాగా నవ్య తెరపైకి రావడం, రాజయ్యతో వివాదం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పాపులారిటీ రావడం, పైగా దళిత మహిళ కావడంతో అధిష్టానం మరోసారి పునరాలోచనలో పడుతుందా .. లేక కడియాన్ని కొనసాగిస్తారా అన్నది చూడాల్సి వుంది.