తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీతో జలగం వెంకటరావు భేటీ: హైకోర్టు కాపీ అందజేత

By narsimha lodeFirst Published Jul 26, 2023, 11:57 AM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీని  జలగం వెంకట్రావు కలిశారు. కొత్తగూడెం ఎమ్మెల్యే విషయమై  హైకోర్టు  ఇచ్చిన  తీర్పు కాపీని  అసెంబ్లీ సెక్రటరీకి అందించారు.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ  సెక్రటరీని జలగం వెంకట్రావ్  బుధవారం నాడు కలిశారు. కొత్తగూడెం ఎమ్మెల్యే విషయమై  మంగళవారంనాడు  తెలంగాణ హైకోర్టు ఇచ్చిన  తీర్పు కాపీని  అసెంబ్లీ కార్యదర్శికి  వెంకట్రావ్ అందించారు.

2018  అసెంబ్లీ ఎన్నికల సమయంలో  కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుండి  కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన  వనమా వెంకటేశ్వరరావు  తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి  జలగం వెంకటరావుపై  విజయం సాధించారు.

 అయితే  ఎన్నికల సంఘానికి  సమర్పించిన  అఫిడవిట్ లో  తన భార్య ఆస్తులను, కేసులను  వనమా వెంకటేశ్వరరావు  పేర్కోనలేదని  జలగం వెంకటరావు  హైకోర్టును  ఆశ్రయించారు. ఈ విషయమై  విచారణ నిర్వహించిన  హైకోర్టు  వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేసింది.  అంతేకాదు  2018 నుండి  కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకటరావు పేరును ప్రకటించింది.  ఈ తీర్పు  కాపీని జలగం వెంకటరావు  ఇవాళ  అసెంబ్లీ సెక్రటరీ  నరసింహాచార్యులుకు  అందించారు.

ఇవాళ మధ్యాహ్నం మూడున్నర గంటలకు  తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ను  కూడ  జలగం వెంకటరావు కలవనున్నారు.  హైకోర్టు కాపీని  వికాస్ రాజ్ కు కూడ అందించనున్నారు.

also read:ఎమ్మెల్యేగా వనమా ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు.. పట్టించిన రైతు బంధు డబ్బులు..!!

2018  అసెంబ్లీ ఎన్నికల సమయంలో  కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుకు  81,118 ఓట్లు పడ్డాయి, బీఆర్ఎస్ అభ్యర్ధి  జలగం వెంకటరావు కు 76,979 ఓట్లు వచ్చాయి. నాలుగు వేలకు పైగా ఓట్లతో వనమా వెంకటేశ్వరరావు  విజయం సాధించినట్టుగా అప్పట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి  ప్రకటించారు.  కాంగ్రెస్ నుండి గెలిచిన వనమా వెంకటేశ్వరరావు ఆ పార్టీని వీడి  బీఆర్ఎస్ లో  చేరారు.

 వనమా వెంకటేశ్వరరావు బీఆర్ఎస్ లో చేరిన తర్వాత  జలగం వెంకటరావు బీఆర్ఎస్ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉంటున్నారు. ఇటీవలనే  జలగం వెంకటరావు  తన  అనుచరులతో సమావేశం  నిర్వహించిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే   తెలంగాణ హైకోర్టు తీర్పుపై  వనమా వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని సమాచారం.

 

 

click me!