కత్తి మహేష్ పై నగర బహిష్కరణ వేటు, స్వగ్రామానికి తరలింపు

First Published Jul 9, 2018, 11:12 AM IST
Highlights

శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తున్నారనే నెపంతో ప్రముఖ సినీ విమర్శకులు కత్తి మహేష్ ను నగర బహిష్కరణ చేస్తూ హైద్రాబాద్ పోలీసులు  సోమవారం నాడు నిర్ణయం తీసుకొన్నారు. 


హైదరాబాద్: సినీ విమర్శకులు కత్తి మహేష్‌పై నగర బహిష్కరణ వేటు వేస్తూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తున్నారనే నెపంతో సోమవారం నాడు హైద్రాబాద్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకొన్నారు.ఈ ఆదేశాల మేరకు కత్తిమహేష్ ను నగరం బయట వదిలేయనున్నారు. 

ఇటీవల కాలంలో కత్తి మహేష్ కొన్ని ప్రసార మాధ్యమాల్లో చేసిన ప్రసంగాలు విధ్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. దీంతో హైద్రాబాద్ పోలీసులు ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నారు.

కత్తి మహేష్ చేస్తున్న ప్రసంగాలు, సోషల్ మీడియాలో చేసిన పోస్టులు విద్వేషాలు కల్గించేలా ఉన్నాయనే ఆరోపణలున్నాయి. శాంతి భద్రతల సమస్యకు విఘాతం కల్గించేలా ఉన్నాయని పలువురు విమర్శిస్తున్నారు..ఈ తరుణంలో కత్తిమహేష్ పై చర్యలు తీసుకోవాలని పలు రాజకీయ పార్టీలు కూడ డిమాండ్ చేశాయి.

ఈ విషయమై కత్తి మహేష్ కు టెర్రరిస్టులకు తేడా లేదని కూడ సీఎల్పీ నేత జానారెడ్డి ఇటీవల కాలంలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సినీ విమర్శకులు కత్తి మహేష్‌ చేసిన ప్రసంగాల విషయమై కొందరు పోలీసులకు కూడ ఫిర్యాదు చేశారు.

దరిమిలా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే  కత్తి మహేష్ ను హైద్రాబాద్ నగరం నుండి బహిష్కరించాలని పోలీసులు  నిర్ణయం తీసుకొన్నారు. ఈ నిర్ణయం మేరకు కత్తి మహేష్ ను నగరం వెలుపలా పోలీసులు వదిలేసి రానున్నారు.

అయితే నగరంలోకి కత్తి మహేష్ రావాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలో ఇలా నగర  బహిష్కరణ చేసిన ఘటన ఇదే తొలిసారి కావడం గమనార్హం.

కత్తి మహేష్ కు ఇవాళ తెల్లవారుజామునే టాస్క్‌పోర్స్ పోలీసులు నోటీసులు అందించారు. అంతేకాదు  హైద్రాబాద్‌లో శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తున్నారనే నెపంతో కత్తి మహేష్ ను ఏపీలో వదిలిపెట్టాలని నిర్ణయం తీసుకొన్నారు. చిత్తూరు జిల్లాలోని కత్తిమహేష్ స్వంత గ్రామంలో కత్తి మహేష్ ను వదిలివేయాలని నిర్ణయం తీసుకొన్నారు. 


 

click me!