BJP : 10ల‌క్ష‌ల మందితో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం.. ఈట‌లకు కీల‌క బాధ్య‌త‌లు !

By Mahesh RajamoniFirst Published Jun 20, 2022, 4:48 PM IST
Highlights

Hyderabad: హైదరాబాద్ లో జ‌ర‌గ‌బోయే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరయ్యేందుకు 10 లక్షల మందికి పైగా వ‌స్తార‌ని కాషాయ పార్టీ నాయ‌కులు అంచ‌నా వేస్తున్నారు. రాష్ట్రంలో ప్ర‌జ‌లు మార్పును కోరుకుంటున్నార‌ని బండి సంజ‌య్ అన్నారు. 
 

BJP National Executive meet: జూలై 3న హైదరాబాద్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరయ్యేందుకు 10 లక్షల మందికి పైగా వ‌స్తార‌ని కాషాయ పార్టీ నాయ‌కులు అంచ‌నా వేస్తున్నారు.  బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరయ్యేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడకు రానున్నారు. అలాగే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స‌హా బీజేపీ ఆగ్ర‌నేత‌లంద‌రూ కూడా ఈ స‌మావేశంలో పాల్గొంటారు. వ‌చ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలో ఎలాగైనా పాగావేయాల‌ని బీజేపీ భావిస్తోంది. ద‌క్షిణాదిన మ‌రో రాష్ట్రంలో అధికారం దక్కించుకుంటే లోక్‌స‌భ ఎన్నికల్లో తిరుగులేని విజ‌యం సాధించ‌వ‌చ్చ‌ని బీజేపీ భావిస్తోంది. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌రిగే తెలంగాణ‌పై కాషాయ పార్టీ దృష్టి సారించింది. 

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. తెలంగాణపై జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అందులో భాగంగానే హైదరాబాద్‌లో జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. జాతీయ కార్యవర్గ సమావేశానికి ముందు పార్టీ సన్నాహక కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ కే లక్ష్మణ్‌, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, కమిటీ జాతీయ ఇంచార్జి అరవింద్‌ మీనన్‌లు ఆదివారం పార్టీ రాష్ట్రంలో ఏర్పాట్లను సమీక్షించారు. జాతీయ కార్యవర్గ సమావేశాన్ని సజావుగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన వివిధ కమిటీల సభ్యులకు కూడా వారు విధులు కేటాయించారు. ఈ కార్యక్రమానికి ప్రతి నియోజకవర్గం నుండి కనీసం 10,000 మంది రావ‌డానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బండి సంజ‌య్ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లకు సూచించిన‌ట్టు స‌మాచారం. 

Latest Videos

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన ఉద్ఘాటించారు. ఇంటింటికీ ప్రచారం నిర్వహించి ఈ కార్యక్రమానికి ప్రజలను ఆహ్వానించాలని పార్టీ కార్యకర్తలను కోరారు. స్థానిక నాయకులను కలవాలని మరియు ఈవెంట్‌కు ముందు ప్రజలను సమీకరించడానికి వారి మద్దతు కోరాలని కూడా వారిని కోరారు.  అందులో భాగంగానే పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి బహిరంగ సభకు ఆహ్వానాలు అందజేయాలని కోరారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సగటున 10 వేల మంది సభకు హాజరయ్యేలా చూడాలన్నారు. జూన్ 22న తమ తమ నియోజకవర్గాలకు వెళ్లి సమావేశానికి హాజరు కావాలని ప్రజలను ఆహ్వానించాలని బండి సంజ‌య్ పార్టీ నేతలను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు రూపంలో విరాళాలు సేకరించవద్దని బండి సంజయ్ పార్టీ కార్యకర్తలను ఆదేశించారు. పార్టీ రాష్ట్ర శాఖ పేరుతో ఉన్న ఖాతాకు డిజిటల్ చెల్లింపుల రూపంలో మాత్రమే విరాళాలు సేకరించాలని చెప్పారు.

అమిత్ షాతో ఈట‌ల భేటీ.. 

ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు బీజేపీ అధినాయకత్వం త్వరలోనే కీలక బాధ్యతలు అప్పగించ‌బోతున్న‌ద‌నే ప్ర‌చారం ఊపంకుంది. అదికూడా  హైదరాబాద్‌లో వచ్చే నెల 2 నుంచి ప్రారంభమయ్యే జాతీయ కార్యవర్గ సమావేశాల కంటే ముందేన‌ని వార్త‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఓటు బ్యాంకు పెంచుకోవడమే లక్ష్యంగా బీజేపీ ఈటలకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని  స‌మాచారం. తెలంగాణలో రానున్న ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి అధికారపీఠం ద‌క్కించుకోవాల‌ని ముందుకు సాగుతున్న త‌రుణంలో ఈటల, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఏం బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌నే చ‌ర్చ మొద‌లైంది. 

click me!