కార్పొరేట్‌ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు.. గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి హరీశ్‌రావు

Published : Nov 07, 2022, 06:01 PM IST
కార్పొరేట్‌ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు.. గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి హరీశ్‌రావు

సారాంశం

Hyderabad: ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్‌ ఆసుపత్రులకు ధీటుగా ఆధునీకరిస్తున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మహబూబ్‌నగర్, సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాథ్ ల్యాబ్‌లు రానున్నాయ‌ని ఆయ‌న తెలిపారు.   

Telangana health minister Harish Rao: ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్‌ ఆసుపత్రులకు ధీటుగా ఆధునీకరిస్తున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మహబూబ్‌నగర్, సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాథ్ ల్యాబ్‌లు రానున్నాయ‌ని ఆయ‌న తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే... నిరుపేద రోగులకు అత్యవసర కార్డియాలజీ సంరక్షణను మెరుగుపరచడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తృతీయ బోధనాసుపత్రుల్లో క్యాథ్ ల్యాబ్‌ల (కార్డియాక్ కాథెటరైజేషన్ లేబొరేటరీ) సంఖ్యను విస్తరిస్తోందని మంత్రి హ‌రీశ్ రావు తెలిపారు. ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌, గాంధీ ఆసుపత్రి, వికారాబాద్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రుల్లో క్యాథ్‌ ల్యాబ్‌లు ప్రారంభించి, రానున్న రోజుల్లో మహబూబ్‌నగర్‌, సిద్దిపేటలో కూడా ఇలాంటి సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని అన్నారు.

“ప్రభుత్వ ఆసుపత్రులు వాటి వైద్య మౌలిక సదుపాయాల పరంగా కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ఆధునీకరించబడుతున్నాయి. పేద‌లు, తక్కువ-ఆదాయ రోగులు నాణ్యమైన వైద్యం పొందేలా చూసేందుకు తెలంగాణ ప్రభుత్వం  సంవత్సరానికి రూ.11,440 కోట్లు ఖ‌ర్చు చేస్తోంది” అని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి టి హరీష్ రావు సోమవారం హైటెక్ సిటీలోని మెడికోవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో ఇమేజింగ్ సేవ‌ల‌ను ప్రారంభించిన అనంత‌రం అన్నారు. అలాగే, కొత్త‌గా మ‌రో ఐదు ప్ర‌భుత్వ కాలేజీల‌ను ఏర్పాటుకు కృషి చేస్తున్నామ‌నీ, దీంతో తెలంగాణలోని మొత్తం ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 17 కి చేరుకుంటుంద‌ని తెలిపారు.

ఆరోగ్య బీమా పథకం పరిధిలోకి వచ్చే ప్ర‌యివేటు ఆసుపత్రుల వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేయదని ఆరోగ్య మంత్రి హ‌రీశ్ రావు హామీ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ కింద మరిన్ని చికిత్సలను అంగీకరించాలని ఆయన ఆసుపత్రులను కోరారు. "క్యాన్సర్ వంటి వ్యాధులకు, చికిత్స ఖర్చు ఎక్కువగా ఉంటుందని అంచనా వేయబడినప్పుడు, పేద రోగులకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడం మా బాధ్యత" అని మంత్రి చెప్పారు.

అంత‌కుముందు రోజు మంత్రి హ‌రీశ్ రావు సిద్దిపేట‌లో ప‌లు అభివృద్ది ప‌నుల‌కు శ్రీకారం చుట్టారు.  సిద్దిపేట ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పాలియేటివ్ కేర్ సెంటర్, ఆసరా, ఆలనా ఇంటింటికీ ఆరోగ్య సేవలను ఆయ‌న ప్రారంభించారు. జిల్లాలో క్యాన్సర్‌ రోగులకు పాలియేటివ్‌ కేర్‌ సెంటర్‌ కానుకగా నిలుస్తోందని పేర్కొన్న మంత్రి ఈరోజుల్లో బిడ్డ‌లు తల్లిదండ్రులను చూసుకునే పరిస్థితి లేకపోవడం బాధాకరమన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులను ఆదుకోవడం చాలా కష్టంగా ఉందనీ, రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలతో వారిని ఆదుకోవాలని నిర్ణయించిందని ఆయన అన్నారు. అటువంటి వారికి అత్యుత్తమ సంరక్షణ కేంద్రాన్ని అందించాలనే లక్ష్యంతో, అవసరమైన సిబ్బందిని నియమించడంతో పాటు ఆసుపత్రిలో ఏడు పడకల పాలియేటివ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే రూ.13 కోట్లు వెచ్చించి ప్రభుత్వాసుపత్రిలో క్యాథ్ ల్యాబ్‌ను కూడా ప్రారంభిస్తామన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?