
కేంద్ర హోం మంత్రి అమిత్ షాను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కలిశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ తమిళిసై.. ఈ రోజు సాయంత్రం అమిత్ షాతో భేటీ అయ్యారు. దాదాపు 15 నిమిషాల పాటు ఈ భేటీ సాగింది. అమిత్ షాను కలిసిన అనంతరం గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడుతూ.. తాను తెలంగాణ గవర్నర్గా మూడేళ్లు పూర్తి చేసుకున్నానని చెప్పారు. నాలుగో ఏడాది గవర్నర్గా కొనసాగుతున్నానని.. విషెస్ పొందడానికి ఇక్కడికి వచ్చినట్టుగా చెప్పారు. అలాగే తెలంగాణ గవర్నర్గా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాసిన పుస్తకాన్ని కేంద్ర హోం మంత్రికి అందజేశానని చెప్పారు. ఇది రోటిన్ విజిట్ మాత్రమేనని తెలిపారు.
అయితే ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, మునుగోడు ఉప ఎన్నిక రిజల్ట్స్ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో గవర్నర్ తమిళిసై భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పైకి రోటిన్ విజిట్ అని చెప్పినప్పటికీ.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై గవర్నర్ కేంద్ర హోం శాఖకు నివేదిక సమర్పించి ఉంటారనే ప్రచారం కూడా సాగుతుంది.