
స్వాతంత్య్ర దినోత్సవం రోజు హైదరాబాద్ ఎల్బీ నగర్లో అర్ధరాత్రి మహిళను స్టేషన్కు తీసుకెళ్లి థర్డ్డిగ్రీకి ప్రయోగించారనే ఆరోపణలకు సంబంధించిన కేసులో రాచకొండ పోలీసు కమిషనర్ సీపీ చౌహాన్ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు కానిస్టేబుల్స్ను సస్పెండ్ చేశారు. మహిళపై దాడికి పాల్పడ్డ హెడ్ కానిస్టేబుల్ శివ శంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలతను సస్పెండ్ చేస్తూ సీపీ చౌహాన్ ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి డీసీపీ సాయిశ్రీ మాట్లాడుతూ.. ఓ మహిళపై పోలీసులు దాడి చేశారని ఆరోపణలు వచ్చాయని తెలిపారు. వివరాలు సేకరించి నిందితులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. సీపీ ఆదేశాలతో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశామని తెలిపారు.
బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకాం.. హైదరాబాద్ మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని వరలక్ష్మి నివాసముంటోంది. కొన్నేళ్ల క్రితమే భర్త చనిపోవడంతో కుటుంబాన్ని ఆమే పెద్దదిక్కుగా మారింది. ఈమె కూతురు పూజకు తిరుమలగిరికి చెందిన కుమార్ నాయక్ తో పెళ్ళి కుదిరింది. ఈ నెల 30న పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే కొద్దిరోజులుగా పెళ్లిపనులు చూసుకుంటోంది లక్ష్మి.
ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున కూతురు పెళ్లికి డబ్బులకోసం సరూర్ నగర్ లోని బంధువుల ఇంటికి వెళ్లింది లక్ష్మి. డబ్బులు తీసుకుని రాత్రి ఒంటరిగా ఇంటికి బయలుదేరిన ఆమెను ఎల్బీ నగర్ సర్కిల్ లో పోలీసులు ఆపారు. కారణం చెప్పకుండానే తమ వాహనంలో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాత్రంతా స్టేషన్ లోనే వుంచి చిత్రహింసలకు గురిచేసారు. , బూతులు తిడుతూ లాఠీలతో చితకబాదారు. అంతటితో ఆగకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు బాధితురాలు చెబుతోంది. లక్ష్మిని రాత్రంతా స్టేషన్ లోనే వుంచి చితకబాదిన పోలీసులు ఉదయం విడిచిపెట్టారు. పోలీసుల దెబ్బలతో నడవలేని స్థితిలో ఆమె ఎలాగోలా ఇంటికి చేరుకుంది. పోలీస్ స్టేషన్ లో జరిగిన విషయం బయటపెడితే నీ సంగతి చూస్తామని బెదిరించడంతో భయపడిపోయిన లక్ష్మి విషయం బయటపెట్టలేదు. కానీ కుటుంబసభ్యులు ధైర్యం చెప్పడంతో కాస్త ఆలస్యమైనా పోలీసుల దాష్టికాన్ని బయటపెట్టింది.
పోలీస్ దెబ్బలతో లక్ష్మి కాళ్లు నల్లగా కమిలిపోయాయి. శరీరంపై అనేక చోట్ల గాయాలున్నట్లు తెలిపారు. పోలీసులు తనతో చాలా అవమానకరంగా ప్రవర్తించారని... ఎక్కడపడితే అక్కడ కొడుతూ రాక్షసత్వం ప్రదర్శించారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. మహిళను రాత్రి పోలీస్ స్టేషన్ లో వుంచడమే తప్పయితే... ఆమెపై థర్డ్ డిగ్రీ కూడా ప్రదర్శించిన ఎల్బీ నగర్ పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.