
హైదరాబాద్లో డ్రగ్స్ నియంత్రణ చర్యలను పోలీసులు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే తార్నాక లో నార్కోటిక్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఓయూ పోలీసులతో కలిసి నార్కొటిక్ అధికారులు ఈ సోదాలు జరిపారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ వినియోగిస్తున్న, సరఫరా చేస్తున్న.. మొత్తం 11 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి గంజాయి, హాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు అరెస్ట్ చేసిన 9 మంది వినియోగదారులు, ఇద్దరు పెడ్లర్స్ ఉన్నారు. డ్రగ్స్ వినియోగిస్తున్నవారిలో విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ఉన్నట్టుగా తెలిసింది. ఇక, విశాఖపట్నం నుంచి హాష్ ఆయిల్ తీసుకొచ్చినట్టుగా నిందితులు పోలీసులకు చెప్పినట్టుగా తెలిసింది. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించే అవకాశం ఉంది.
ఇక, ఇటీవల బంజారా హిల్స్లోని పుడింగ్ అండ్ మింక్ పబ్లో లేట్ నైట్ పార్టీపై పోలీసులు దాడి చేయడంతో కీలక విషయాలు వెలుగుచూశాయి. పబ్లో ఉన్నవారిని పోలీసు స్టేషన్ తరలించి.. ఆ తర్వాత వారి వివరాలు తీసుకుని వదిలిపెట్టారు. వీరిలో చాలా మంది సెలబ్రిటీలు, బడా బాబుల పిల్లలే ఉన్నారు. అయితే పబ్లో డ్రగ్స్ దొరకడంతో పోలీసులు.. అవి ఎవరు వినియోగించారు..?, వారికి సరఫరా చేసింది ఎవరు..? అనే కోణాల్లో విచారణ చేపట్టారు.
ఈ క్రమంలోనే పబ్కు సంబంధించిన నలుగురిని పోలీసులు ఈ కేసులో నిందితులుగా చేర్చారు. వీరిలో అభిషేక్, అనిల్ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వారిని కోర్టు ముందు హాజరుపరచగా.. కోర్టు వారికి రిమాండ్ విధించింది. మరో ఇద్దరు నిందితులు అర్జున్, కిరణ్ రాజుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లో ఉన్న డేటా విశ్లేషణ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పబ్లో డ్రగ్స్ వినియోగించింది ఎవరు..?, వారికి సరఫరా చేసింది ఎవరనే వివరాలను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు.
పుడింగ్ అండ్ మింక్ పబ్లో డ్రగ్స్ దొరకడంతో హైదరాబాద్లో డ్రగ్స్ వినియోగం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే పోలీసులు సీరియస్గా స్పందించారు. డ్రగ్స్ నియంత్రణలో భాగంగా పలుచోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు.