
Telangana rainfall: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చాలా ప్రాంతాలు నీటమునిగాయి. తెలంగాణలోని చాలా జిల్లాల్లో బుధవారం వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే ఎల్లో అలర్ట్ ప్రకటించింది. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో జూలై 25 ఉదయం 8 గంటల నుండి జూలై 26 ఉదయం 8 గంటల వరకు 24 గంటల్లో భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్డీపీఎస్) ప్రకారం అత్యధికంగా విఖారాబాద్ జిల్లాలో 130.5 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా హయత్నగర్ మండలంలో 98.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
తెలంగాణ వెదర్మ్యాన్ అని కూడా పిలువబడే టి బాలాజీ తన ట్విట్టర్ ఖాతాలో “ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జనగాం, మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల్ జిల్లాల్లో రాబోయే 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయి” అని ట్వీట్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముందుగా అంచనా వేసింది. వివిధ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. టీఎస్డీపీఎస్ ప్రకారం హైదరాబాద్లోనూ వర్షాలు కురుస్తాయి. నగరంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 28-31 డిగ్రీల సెల్సియస్, 20-22 డిగ్రీల సెల్సియస్ పరిధిలో ఉండే అవకాశం ఉందని కూడా అంచనా వేసింది. మొత్తం రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 30-33 డిగ్రీల సెల్సియస్, 20-23 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉండనుందని సమాచారం.
ఇదిలావుండగా, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో సోమవారం నుంచి వానలు దంచికొడుతున్నాయి. దీంతో నగరంలోనే అనేక ప్రాంతాలు వర్షపు నీటిలో మునిగాయి. పలు ప్రాంతాల్లో అయితే, ప్రమాదకర స్థాయిలో నడుముల మట్టం వరకు వరద నీరు ప్రవహిస్తోంది. ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నాంపల్లి, పాతబస్తీ, కోఠి, ఆబిడ్స్, మలక్పేట, దిల్సుఖ్నగర్, ముషీరాబాద్, కాప్రా, హెచ్బీ కాలనీ, కుషాయిగూడ, రాయదుర్గం, ఖాజాగూడ, కొత్తపేట, ఎల్బీనగర్, హయత్నగర్, హిమాయత్నగర్, నారాయణగూడ తదితర ప్రాంతాల్లోని పరిస్థితలు దారుణంగా మారాయి. అప్రమత్తమైన అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఇండ్లలోకి వరద నీరు చేరుతుండగా, బుధవారం వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.