
హన్మకొండ జిల్లాలోని కమలాపూర్లో పదో తరగతి పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలని హన్మకొండ జిల్లా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) సత్యనారాయణ గౌడ్ సోమవారం నాల్గవ అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. బండి సంజయ్ బెయిల్ను రద్దు చేసి పోలీసు కస్టడీకి పంపాలని కూడా విజ్ఞప్తి చేశారు. ప్రశ్నపత్రం లీకేజీ కేసులో పోలీసుల విచారణకు సంజయ్ సహకరించడం లేదని పేర్కొన్నారు. బెయిల్పై విడుదలైన బండి సంజయ్ తన మొబైల్ ఫోన్ను పోలీసులకు అప్పగించలేదని, తన సమావేశాల్లో రెచ్చగొట్టే ప్రసంగాలను కొనసాగిస్తున్నారని చెప్పారు.
అయితే నాల్గవ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. ఈ క్రమంలోనే నేడు మరోసారి ఈ పిటిషన్పై కోర్టులో విచారణ జరిగింది. అయితే బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్ను నాల్గవ మున్సిప్ మెజిస్ట్రేట్ కోర్టు రిటర్న్ చేసింది. పిటిషన్లో పేర్కొన్న ప్రొవిజన్లతో మెజిస్ట్రేట్ విబేధించారు. దీంతో బండి సంజయ్ను బెయిల్ రద్దు కోరుతూ హైకోర్టును తెలంగాణ ప్రభుత్వం అశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక, ఈ కేసులో బండి సంజయ్ను అరెస్ట్ చేసిన వరంగల్ పోలీసులు ఆయనపై 120 (బీ), 420, 447, 505(1), 4(ఏ), తెలంగాణ రాష్ట్ర పరీక్షల నిర్వహణ చట్టం 46, 8, 66(డీఐటీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బండి సంజయ్ను అరెస్ట్ చేసిన పోలీసులు హన్మకొండ కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలోనే న్యాయమూర్తి 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో బండి సంజయ్ను కరీంనగర్ జైలుకు తరలించారు. అయితే ఆ తర్వాత బండి సంజయ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బండి సంజయ్ పిటిషన్పై 8 గంటలపాటు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. అనంతరం బండి సంజయ్కు జడ్జి రాపోలు అనిత రూ.20 వేల పూచీకత్తుపై షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.