
Electric Shock : శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో వివాదం చోటుచేసుకుంది. వేడుకల్లో భాగంగా రథాన్ని లాగుతున్నప్పుడు విద్యుత్ షాక్ సంభవించింది. దీంతో ఒక్కసారిగా ఘోర విషాదం జరిగింది. ఈ ఘటనా స్థలంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు, మరో నలుగురికి గాయాలు రావడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. స్థానికులు వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఈ విషాధ ఘటన హైదరాబాద్ రామంతాపూర్లో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్ రామంతాపూర్లోని గోకులేనగర్లో ఆదివారం అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా రథానికి లాగుతుండగా విద్యుత్ తీగలు తగిలి ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. రథాన్ని లాగుతున్న వాహనం మరమ్మతుకు గురికావడంతో దాన్ని పక్కన నిలిపివేసిన యువకులు, రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రథానికి విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో తొమ్మిది మందికి విద్యుత్ షాక్ కొట్టింది. వారంతా ఒక్కసారిగా విసిరేసినట్లు దూరంగా పడిపోయారు.
దీంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు వారిని ప్రాథమిక చికిత్స చేపట్టి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఐదుగురు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో నలుగురిని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన వారిలో కృష్ణయాదవ్, సురేశ్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, రుద్ర వికాస్, రాజేంద్ర రెడ్డి ఉన్నట్లు గుర్తించారు. వారి మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి గన్మెన్ శ్రీనివాస్ సైతం ఉన్నట్లు సమాచారం.