
మహబూబాబాద్ జిల్లా (Mahabubabad district) గడ్డిగూడెం తండాలో దారుణం చోటుచేసకుంది. కన్నపిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవల్సిన తండ్రే కాలయముడయ్యాడు.కొడుకు, కూతురును బావిలో పడేశాడు. దీంతో పిల్లలిద్దరు మృతిచెందారు. కుటంబ కలహాలతో అతడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇంతటి దారుణానికి పాల్పడిన వ్యక్తిని రామ్ కుమార్గా గుర్తించారు. అతడు సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. వివరాలు.. గడ్డిగూడెం తండాకు చెందిన రామ్ కుమార్... పదేళ్ల క్రితం అదే తండాకు చెందిన శిరీషను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఎనిమిదేళ్ల అమీ జాక్సన్, ఆరేళ్ల జానీ బెస్టో ఉన్నారు. రామ్ కుమార్ ప్రస్తుతం ముంబైలో విధులు నిర్వర్తిస్తున్నాడు.
అయితే కొంతకాలంగా రామ్ కుమార్, శిరీషల మధ్య కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. రామ్ కుమార్ మూడు రోజు క్రితం సెలవుపై గ్రామానికి వచ్చాడు. భార్య శిరీష్ గత రాత్రి తన పుట్టింటికి వెళ్లింది. ఈరోజు ఉదయం పిల్లలను బైక్పై పొలం వద్దకు తీసుకెళ్లిన రామ్కుమార్ ఇద్దరు పిల్లలను బావిలోకి (throws children into well) తోసేశాడు. దీంతో వారు మృతిచెందారు. పిల్లలను బావిలో తోసేసిన అనంతరం రామ్ కుమార్ అక్కడి నుంచి పారిపోయాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న రామ్ కుమార్ కోసం గాలిస్తున్నారు. ఇక, పిల్లల మృతదేహాలు చూసిన తల్లి శిరీష, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.