హైదరాబాద్ నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర తీరాన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ సందర్బంగా సీఎం కేసీఆర్పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (BJP MLA Etela Rajender) సంచలన వ్యాఖ్యలుచేశారు.
భారతదేశానికి తలమానికంగా నిలిచే చారిత్రక ఘట్టం తెలంగాణలో ఆవిష్కృతమైంది. హైదరాబాద్ నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర తీరాన దేశంలోనే ఎత్తయిన అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్తో పాటు ముఖ్యఅతిథిగా బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ హాజరై అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ తరుణంలో సీఎం కేసీఆర్ (CM KCR) పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (BJP MLA Etela Rajender)సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. బాబా సాహెబ్ కలలు కన్న జాతి నిర్మాణం జరగాలని కోరుకున్నారు. కులాలు, అసమానతలు లేని సమాజం రావాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత.. తొలి సీఎం దళితుడని కేసీఆర్ మాట ఇచ్చి తప్పారనీ, ఇది తొలి ఉల్లంఘన అన్నారు. మాల, మాదిగ అని జాతులను విడదీశారని విమర్శించారు. దళితులను ముఖ్యమంత్రి చెయ్యకపోగా.. డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న దళిత మంత్రిని కూడా కారణాలు చెప్పి తొలగించారని ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు.
విగ్రహాలు, కొత్త సెక్రటరీయేట్కు అంబేద్కరుడి పేరు పెట్టినంత మాత్రాన బహుజనులకు న్యాయం జరగదన్నారు. రానున్న ఎన్నికల్లో అధికారం ఎక్కడ పోతుందోనని భయపడ్డారనీ, తెలంగాణ ప్రజల్లో పుట్టగతులు ఉండవని తెలిసి సీఎంకేసీఆర్ (CM KCR) అంబేద్కర్ జపం అందుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం, నగరం నడిబొడ్డున 125 అడుగుల విగ్రహం పెట్టడం సంతోషమని అన్నారు. అలాగే తెలంగాణలో దళితులకు మూడెకరాల భూమి, దళిత బంధు హామీలు నెరవేర్చాలని సీఎం కేసీఆర్ కు గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు దళితులకు ఇచ్చిన భూములను కేసీఆర్ ప్రభుత్వం లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని, ఆ దళితుల భూములను తిరిగి వారికి వెనక్కి ఇవ్వాలని ,దళితుల కళ్ళల్లో మట్టి కొట్టారని ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు.